- 12 మంది మృతి, 10 మందికి గాయాలు
బుడాపెస్ట్ : తూర్పు హంగేరీలోని ఒక హైవేపై రాత్రిపూట పోలిష్ బస్సు బోల్తా పడటంతో 12 మంది మృతి చెందారని, కనీసం 10 మంది గాయపడ్డారని హంగేరీ ప్రధాన మంత్రి పీటర్ మగ్యార్ తెలిపారు. మెజోకెరెస్జ్టెష్ పట్టణం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ బస్సు గుంతలో బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ఈ బస్సు నైరెద్హాజా నగరం వైపు మోటార్వేపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ బస్సులో 57 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. నైరెద్హాజా వైపు ఎం3 మోటార్వేపై ప్రయాణిస్తున్న పోలిష్ రిజిస్ట్రేషన్ బస్సు... నేరుగా ఉన్న రహదారి నుంచి గుంతలోకి వెళ్లి బోల్తా పడింది. ప్రమాద స్థలంలోనే 11 మంది మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 37 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు సెర్బియా నుంచి పోలండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 2003లో సియోఫోక్ వద్ద రైలు జర్మన్ పర్యాటక బస్సును ఢీకొట్టిన ఘటన తర్వాత హంగేరీలో ఇదే అత్యంత భారీ రోడ్డు ప్రమాదం కావడం గమనార్హం. హంగేరీలో జరిగిన పోలిష్ బస్సు ప్రమాదం కలిచివేసిందని. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానని పోలండ్ అధ్యక్షుడు కరోల్ నావ్రోకి తెలిపారు. బస్సు డ్రైవర్ను కస్టడీలోకి తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.








కామెంట్లు (0)