వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అనిల్ మీనన్ ఈ నెల 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి వెళ్లనున్నారు. రష్యా వ్యోమనౌక సోయుజ్-ఎంఎస్-29 ద్వారా ఈ యాత్ర జరుగనుంది. కజకిస్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ ఇందుకు వేదికవుతుంది. మీనన్తోపాటు రష్యా వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినా కూడా రోదసిలోకి వెళతారు. మీనన్.. అమెరికాలోని మినియాపొలిస్లో జన్మించారు. అత్యవసర వైద్య నిపుణుడిగా, మెకానికల్ ఇంజినీర్గా గుర్తింపు పొందారు. ఆయన తండ్రి భారత్ నుంచి వలస వెళ్లగా.. తల్లికి ఉక్రెయిన్ మూలాలున్నాయి. మీనన్.. అమెరికా వైమానిక దళంలోనూ పనిచేశారు. అఫ్గానిస్థాన్ యుద్ధంలో పాలుపంచుకున్నారు. ఎవరెస్టు పర్వతారోహకులను సంరక్షించే హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్కూ సేవలందించారు. రోటరీ అంబాసోడోరియల్ స్కాలర్గా ఆయన పోలియో టీకా కార్యక్రమంపై అధ్యయనం కోసం భారత్లో ఏడాది పాటు ఉన్నారు. ఐఎన్ఎస్కు వెళ్లిన తర్వాత మీనన్ 8 నెలల పాటు రోదసిలో ఉంటారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల మానవ శరీరంపై పడే ప్రభావాన్ని ఆయన అధ్యయనం చేస్తారు. ఐఎస్ఎస్లోని తాగునీటి వ్యవస్థను ఉపయోగించుకొని.. రక్తనాళాల్లోకి ఎక్కించే ద్రవాలను తయారుచేసే పరిజ్ఞానాలనూ ఆయన పరీక్షిస్తారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)లో ఫ్లైట్ సర్జన్గా 2014లో మీనన్ చేరారు. ఐఎస్ఎస్ వ్యోమగాములతో కలిసి పనిచేశారు. 2018లో ఆయన స్పేస్ ఎక్స్లోని వైద్య విభాగంలో చేరారు. 2021 డిసెంబరులో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. మీనన్ భార్య అన్నా విల్హెమ్ కూడా వ్యోమగామే. 2024 సెప్టెంబరులో ఆమె అంతరిక్షయానం చేశారు.








కామెంట్లు (0)