హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్లో సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందారు. సలాడో గ్రామం సమీపంలోని ఓ పొలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో హెలికాప్టర్ పైలట్, కో-పైలట్ ఉన్నారు. ఫోర్ట్ హుడ్ సమీపంలోని అమెరికా సైనిక స్థావరం నుంచి బయలుదేరిన AH-64 అపాచీ దాడి హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ అదుపు తప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. కూలిన వెంటనే హెలికాప్టర్లో మంటలు చెలరేగి సమీపంలోని పొలానికి వ్యాపించాయి. దీంతో దాదాపు 100 ఎకరాల ప్రాంతం అగ్నికి ఆహుతైంది. సాయంత్రం 5 గంటల సమయానికి మంటలను సుమారు 45 శాతం అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు సైనికులు ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. వారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. మృతదేహాలను కార్ల్ ఆర్. డార్నాల్ ఆర్మీ మెడికల్ సెంటర్కు తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు అమెరికా సైన్యం దర్యాప్తు ప్రారంభించింది.








కామెంట్లు (0)