ప్యోంగ్యాంగ్ : అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల వ్యవధి, పరిమాణాన్ని తగ్గించినా వాటి స్వభావంలో ఎలాంటి మార్పు లేదని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఈ విన్యాసాలు ఇప్పటికీ ‘‘రెచ్చగొట్టేవి, దూకుడైనవే’’ అని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ గురువారం వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాను ‘‘శత్రుత్వపూరితంగా’’ భావించే సైనిక విన్యాసాలను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో కిమ్ యో జోంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, అమెరికా తీసుకున్న ఈ చర్యను ఉత్తర కొరియా సద్భావన చర్యగా పరిగణించలేమని, విన్యాసాల వ్యవధి, పరిమాణాన్ని తగ్గించినంత మాత్రాన వాటి ‘‘రెచ్చగొట్టే, దూకుడు స్వభావం మారదు’’ అని కిమ్ యో జోంగ్ స్పష్టం చేశారు. అమెరికాతో ఇటీవలి కాలంలో కిమ్ జోంగ్ ఉన్కు ఎలాంటి సంప్రదింపులు జరిగాయో తనకు తెలియదని కూడా ఆమె తెలిపారు.
అయితే ఉత్తరకొరియా 120 వరకు అణ్వాయుధాలను కలిగి ఉందని దక్షిణ కొరియా రక్షణమంత్రి ప్రకటించారు. అమెరికా ప్రకటించిన వాటి కంటే అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు. ఉత్తర కొరియా సుమారు 80 నుండి 120 మధ్య అణ్వాయుధాలను కలిగి ఉన్నట్లు భావిస్తున్నామని, కానీ ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించలేమని రక్షణమంత్రి అన్ గ్యు-బాక్ పార్లమెంటరీ కమిటీకి వెల్లడించారు. ప్రైవేట్ పరిశోధనా సంస్థల అంచనా ఆధారంగా ఈ సంఖ్యను వెల్లడించామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వివరాలను దక్షిణ కొరియా సైన్యం అధికారికంగా నిర్థారించాల్సి వుందని అన్నారు.








కామెంట్లు (0)