ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
సీటెల్: అమెరికాలోని సీటెల్ నగరంలో నిర్వహించిన ప్రముఖ ‘బైట్ ఆఫ్ సీటెల్’ ఫుడ్ ఫెస్టివల్ విషాదంగా ముగిసింది. స్పేస్ నీడిల్ సమీపంలోని సీటెల్ సెంటర్ ఈవెంట్స్ కాంప్లెక్స్లో ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని నగర అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, డౌన్టౌన్కు వాయువ్యంగా ఉన్న ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. హార్బర్వ్యూ మెడికల్ సెంటర్ ప్రతినిధి సూసన్ గ్రెగ్ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన వారిలో ఒక పసిబిడ్డ, 23 ఏళ్ల యువకుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఘటన సమయంలో ఫెస్టివల్లో ఉన్న ప్రత్యక్ష సాక్షి ఎస్టాన్ వాకోనాబో మాట్లాడుతూ, తాను ఫోటో బూత్ కోసం క్యూలో నిలబడి ఉండగా వెనుక నుంచి ఎవరో తోసేయడంతో వెనక్కి తిరిగి చూడగా ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారని చెప్పారు. "ప్రజలు దాక్కుంటున్నారు.. ఒకరినొకరు తోసుకుంటున్నారు.. పిల్లల బండ్లు కూడా కింద పడిపోతున్నాయి" అని ఆయన వివరించారు.








కామెంట్లు (0)