అమెరికా కోర్టు ఉత్తర్వులు
న్యూయార్క్ :వెనిజులా అధ్యక్షులు నికొలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ విచారణ వచ్చే ఏడాది జూన్ 1 నుండి ఆరంభమవుతుందని బుధవారం అమెరికా జడ్జి రూలింగ్ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 3న అమెరికా బలగాలు పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్ జరిపి బలవంతంగా అమెరికాకు తరలించిన తర్వాత న్యూయార్క్ కోర్టుకు ఈ దంపతులు మూడోసారి హాజరయ్యారు. బుధవారం 15 నిముషాల పాటు సాగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి అల్విన్ హెల్లర్స్టెన్ విచారణా తేదీని నిర్ధారించారు. ఇరు పక్షాల న్యాయవాదుల అభ్యర్ధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మదురో తరపు న్యాయవాది బారీ పొల్లాక్ మాట్లాడుతూ, మదురోపై ఇలా అభిశంసనను నమోదు చేయడాన్ని సార్వభౌమాధికార ప్రాతిపదికన తాము సవాలు చేస్తామని తెలిపారు. ఒకవేళ అదేగనుక విజయవంతమైతే మదురో ఇక ఈ కేసులో విచారణను కొనసాగించాల్సిన అవసరం వుండదన్నారు. మన్హటన్ కోర్టు వెలుపల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా విచారణ సందర్భంగా పెద్ద సంఖ్యలో మదురో మద్దతుదారులు, నిరసనకారులు కోర్టు వద్దకు చేరుకున్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. విదేశాల్లో అమెరికా సైనిక జోక్యాన్ని ఖండించారు. నాడు ట్రంప్ ప్రభుత్వం వెనిజులా అధ్యక్ష భవనంపై సాగించిన దుస్సాహస దాడులు అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ఖండనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత రెండు రోజులకే జనవరి 5న జరిగిన తొలి విచారణలో మదురో మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రవాణాతో సహా అమెరికా చేస్తున్న అభియోగాలన్నింటిలో తాను నిర్దోషినని చెప్పారు. న్యూయార్క్లోని బ్రూక్లిన్లోని నిర్బంధ కేంద్రంలో మదురు దంపతులు వున్నారు.








కామెంట్లు (0)