క్యూ1లో రూ.7,769 కోట్ల లాభాలు
బెంగళూరు : ప్రముఖ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ తదుపరి కొత్త సిఇఒగా ఆశిష్ కుమార్ దాస్ నియమితులయ్యారు. 2027 ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటి వరకు ప్రస్తుత సిఇఒ సలీల్ పరేఖ్ పదవిలో కొనసాగుతారని సంస్థ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.7,769 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 12.2 శాతం అధికం. కంపెనీ ఆదాయం 14 శాతం పెరిగి రూ.48,211 కోట్లకు చేరుకుంది. లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాల మెరుగైన పనితీరు వృద్ధికి తోడ్పడగా, అమెరికా, యూరప్ మార్కెట్లలో కూడా స్థిర కరెన్సీ ప్రాతిపదికన వృద్ధి నమోదయ్యింది. ప్రస్తుతం వార్షిక ఆదాయ వృద్ధి 1.5 శాతం నుంచి 3 శాతం మధ్య ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. ఇన్ఫోసిస్ టోపాజ్ ఆధారిత ఎంటర్ప్రైజ్ ఎఐ సేవలకు మంచి స్పందన లభిస్తోందని, భారీ ఒప్పందాల సాధనతో ఎఐ ఆధారిత వ్యాపారం సంస్థ వృద్ధికి కీలకంగా మారుతోందని సిఇఒ సలీల్ పరేఖ్ తెలిపారు.








కామెంట్లు (0)