• డాలర్ బలహీనత ఎఫెక్ట్
• బంగారం@రూ.1.62 లక్షలు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలహీనపడటంతో పాటు ట్రెజరీ రాబడులు తగ్గడంతో బంగారం సహా విలువైన లోహాల డిమాండ్ భారీగా పెరిగింది. స్థానిక బులియన్ వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల పసిడి ధర రూ.4,300 పెరిగి మూడు నెలల గరిష్ట స్థాయి అయిన రూ.1,62,300కి (అన్ని పన్నులతో కలిపి) చేరుకుంది. బుధవారం ఈ ధర రూ.1,58,000 వద్ద ముగిసింది. మే 26వ తేదీన పది గ్రాముల బంగారం రూ.1,62,400 వద్ద పలికిన తర్వాత మళ్లీ అదే స్థాయికి చేరడం గమనార్హం. బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెట్టింది. కిలో వెండి ధర రూ.2,35,000 నుంచి ఏకంగా రూ.10,000 ఎగబాకి ఏడు వారాల గరిష్ట స్థాయి అయిన రూ.2,45,000కి (అన్ని పన్నులతో కలిపి) చేరుకుంది. ‘‘అమెరికా డాలర్ ఇండెక్స్ మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, బాండ్లపై రాబడులు తగ్గడం వంటి పరిణామాలు పసిడికి బలమైన మద్దతునిచ్చాయని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. డాలర్ బలహీనపడటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే విలువైన లోహాల వైపు మొగ్గుచూపుతున్నారన్నారు.








కామెంట్లు (0)