- సామాన్యులపై అదనపు భారం
- పెరిగిన దిగుమతి వ్యయాలు
న్యూఢిల్లీ: ఇప్పటికే పెరిగిన వంటనూనెల ధరలు రాబోయే రోజుల్లో మరింత భారమయ్యే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెల ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం, ఈ ఏడాది వర్షాలు ఆశించినంతగా లేకపోవడంతో దేశీయంగా నూనెగింజల ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వంటనూనెల ధరలు మరింత పెరగొచ్చని ఆ పరిశ్రమ వర్గాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో సగటున ఆవ నూనె కిలో రూ.193, సోయాబీన్ నూనె రూ.163, పామ్ ఆయిల్ రూ.147 వరకు విక్రయిస్తున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ధరలు 10 నుంచి 13 శాతం వరకు పెరిగాయి. భారత్ తన అవసరాల్లో సగానికి పైగా వంటనూనెలను ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా భారత వినియోగదారులపై పడుతోంది. మరోవైపు గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తగినంత వర్షాలు లేకపోవడంతో సోయాబీన్, వేరుశెనగ వంటి నూనెగింజల సాగు గణనీయంగా తగ్గింది. దేశీయ ఉత్పత్తి తగ్గితే దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు ధరలు, వర్షాల పరిస్థితి మెరుగుపడే వరకు వంటనూనెల ధరలు అధికంగానే కొనసాగే అవకాశం ఉంది. దీంతో రాబోయే నెలల్లో ప్రతి ఇంటి నెలవారీ కిరాణా ఖర్చుపై అదనపు భారం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.








కామెంట్లు (0)