న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ప్రభుత్వ రంగ ఇంధన సరఫరా సంస్థ గెయిల్ ఇండియా అంచనాలకు మించి ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన రెండింతలకు పైగా పెరిగి రూ.4,292 కోట్లకు చేరగా, ఆదాయం 12 శాతం పెరిగి రూ.38,982 కోట్లుగా నమోదయ్యింది. అయితే ఈ లాభాల పెరుగుదలకు ప్రధాన కారణం వ్యాపార విస్తరణ కాకుండా, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలతో ఎల్ఎన్జి సరఫరాలు దెబ్బతినడం వల్ల సహజవాయు ధరలు పెరగడం. దీంతో గ్యాస్ మార్కెటింగ్ మార్జిన్లు భారీగా పెరిగి, గ్యాస్ విక్రయాల పరిమాణం తగ్గినప్పటికీ మార్కెటింగ్ విభాగం లాభం రూ.1,072 కోట్ల నుంచి రూ.3,481 కోట్లకు ఎగబాకింది.
మార్చి నుంచి పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెట్రోనెట్ ఎల్ఎన్జి ఫోర్స్ మేజ్యూర్ ప్రకటించడంతో గెయిల్కు కేటాయించిన ఎల్ఎన్జి సరఫరాలు నిలిచిపోయాయి. దీంతో కంపెనీ స్పాట్ మార్కెట్ నుంచి అధిక ధరలకు గ్యాస్ను సమీకరించి ప్రాధాన్య రంగాలకు సరఫరా చేసింది. ఈ పరిస్థితులు తాత్కాలికంగా గెయిల్ మార్జిన్లను పెంచి భారీ లాభాలకు మద్దతును అందించాయి.








కామెంట్లు (0)