- మధ్యాహ్నం 3.30గం.ల నుంచి
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా మూడో, చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్లో గెలిచి సమంగా ఉన్న క్రమంలో ఈ వన్డేలో గెలిచిన జట్టుకు సిరీస్ దక్కనుంది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుండడం మరో విశేషం. తొలి వన్డేలో టీమిండియా 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తుచేసింది. దీంతో ఇరు జట్లు ట్రోఫీపై కన్నేశాయి. లార్డ్స్ పిచ్ తొలుత బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో మంచి సీమ్ మూవ్మెంట్, అదనపు బౌన్స్ లభించే అవకాశం ఉంది. అయితే బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద పారడం ఖాయం. గణాంకాల ప్రకారం ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 289 పరుగులు, రెండో ఇన్నింగ్స్ సగటు 201 పరుగులు. ఇప్పటివరకు ఈ వేదికపై మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే మెరుగైన విజయావకాశాలున్నాయి. ఇటీవలి పది వన్డే మ్యాచ్లలో భారత్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. భారత్ 8 విజయాలు నమోదు చేయగా, ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుత సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో మూడో వన్డేపై ఉత్కంఠ నెలకొంది. జట్లు(అంచనా).. ఇండియా: శుభ్మన్(కెప్టెన్), రోహిత్, కోహ్లి, ఇషాన్(వికెట్ కీపర్), శ్రేయస్, సుందర్, అక్షర్, దూబే, గుర్నూర్ బ్రార్, బుమ్రా, ప్రసిద్ కృష్ణ. ఇంగ్లండ్: బ్రూక్(కెప్టెన్), డకెట్, బేథెల్, రూట్, కర్రన్, బట్లర్(వికెట్ కీపర్), విల్ జాక్స్, అట్కిన్సన్, ఆర్చర్, రషీద్, మహమూద్.








కామెంట్లు (0)