అమెజాన్, ఉబెర్లో వేల మందిపై వేటు
వాషింగ్టన్ : కృత్రిమ మేధ (ఎఐ) ఆధారిత సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ టెక్ దిగ్గజాలు ఉద్యోగులను అర్ధంతరంగా రోడ్డు పాలు చేస్తున్నాయి. తాజాగా అమెజాన్, ఉబెర్ సంస్థలు తమ కార్యకలాపాల్లో ఎఐ వినియోగాన్ని మరింత పెంచేందుకు ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో వైట్-కాలర్ ఉద్యోగాల భవిష్యత్తుపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. అమెజాన్ తన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఎజిఐ) విభాగంలో సిబ్బందిపై వేటు వేస్తోంది. అత్యాధునిక ఎఐ మోడళ్లు, ఉత్పత్తుల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొద్ది నెలల క్రితమే సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 16,000 ఉద్యోగులను తొలగించింది. అయితే ఈసారి ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని అమెజాన్ వెల్లడించలేదు.
ఉబెర్లో 10 శాతం కోత
అమెజాన్ బాటలోనే క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ కూడా తన కస్టమర్ సర్వీస్ విభాగంలో సుమారు 10 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. కార్యకలాపాలను మరింత సరళీకరించడం, సామర్థ్యాన్ని పెంచడం కోసం ఎఐ వినియోగాన్ని విస్తరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇకపై కస్టమర్ సేవలకు సంబంధించిన అనేక ప్రశ్నలు, ఫిర్యాదులను ఎఐ ఆధారిత వ్యవస్థలే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
పెరుగుతున్న ఆందోళనలు..
సంస్థలు ఇప్పుడు ఎఐని ప్రయోగాత్మక సాంకేతికతగా కాకుండా తమ వ్యాపార నిర్మాణంలో కీలక భాగంగా పరిగణిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎఐ ఆధారంగా ఉత్పాదకతను పెంచడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంటున్నా యన్నారు. అయితే ఈ మార్పులు ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్, అడ్మినిస్ట్రేషన్, బ్యాక్ఆఫీస్ కార్యకలాపాలు వంటి వైట్ కాలర్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఎఐ వినియోగం మరింత విస్తరించడంతో ఉద్యోగాల స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటుచేసు కునే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.








కామెంట్లు (0)