- 1,200 కిలోమీటర్ల ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ మూసివేత
- భారత రిఫైనరీల్లో భయాలు
- పెరిగిన సరఫరా అంతరాయాలు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం సౌదీ అరామ్కో భారతీయ రిఫైనరీలకు ముడిచమురు సరఫరాను నిలిపివేసింది. సౌదీలోని కీలక ఈస్ట్ వెస్ట్ పైప్లైన్పై డ్రోన్ దాడి జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు సరఫరా అంతరాల భయాలతో ఆందోళనలో ఉన్న భారతీయ రిఫైనరీలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
అరేబియా ద్వీపకల్పం గుండా సుమారు 1,200 కిలోమీటర్లు విస్తరించిన ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ను ఇరాక్ నుంచి ఇరాన్ మద్దతు పొందుతున్న మిలీషియాలు డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. దీంతో గురువారం అధికారులు పైప్లైన్ను అత్యవసరంగా మూసివేశారు. రోజుకు 70 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న ఈ పైప్లైన్ను హర్మూజ్ జలసంధి వద్ద నౌకా రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సౌదీ అరేబియా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది.
పశ్చిమాసియా ప్రభావం..
యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు పశ్చిమ రెడ్ సీ తీర ప్రాంతంలోని ఇంధన, పౌర మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడుతున్నారు. రెడ్ సీలో సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు హెచ్చరించడంతో ఈ నెల ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లను దాటాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 1.65 డాలర్లు లేదా 1.6 శాతం తగ్గి 103.17 డాలర్లకు చేరాయి. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ 61 సెంట్లు లేదా 0.6 శాతం తగ్గి 101.30 డాలర్ల వద్ద నమోదయ్యాయి.








కామెంట్లు (0)