లోక్సభలో ఎటువంటి చర్చ లేకుండా 11 బిల్లులు ఆమోదం
ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జులై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ 12 బిల్లులను ఆమోదించింది. వీటిలో, ఒక బిల్లుపై మాత్రమే ఉభయ సభల్లో కూలంకషంగా చర్చ జరిగింది. నీట్ లీక్ తరువాత విద్యార్థుల నిరసనలను అణచివేసేందుకు ప్రవేశపెట్టిన 'పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ (సవరణ) బిల్లు'పై లోక్సభలో 10 గంటల 54 నిమిషాలు, రాజ్యసభలో 6 గంటల 39 నిమిషాలు చర్చ జరిగింది. లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ చర్చకు వచ్చిన ఏకైక బిల్లు ఇదే. ఈ బిల్లు మినహా, మరే ఇతర బిల్లుపైనా ఏ సభలోనూ కూలంకషంగా చర్చ జరగలేదు. లోక్సభ 11 బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించింది. ఈ బిల్లులలో తొమ్మిదింటిపై సంబంధిత మంత్రులు మాత్రమే మాట్లాడారు. కీలకమైన అంశాలపై వివరణ ఇవ్వని కేంద్ర ప్రభుత్వ దుస్సాహసానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉభయ సభలలో తీవ్రంగా నిరసన తెలుపుతుండగా, కేంద్ర ప్రభుత్వం చర్చ లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఆమోదించుకుంది. 1969 జనన, మరణాల నమోదు చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన ముఖ్యమైన బిల్లుపై లోక్సభలో ఎలాంటి చర్చ జరగలేదు. రాజ్యసభలో కేవలం 50 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. ప్రతి ఎంపికి కేటాయించిన సగటు సమయం కేవలం మూడు నిమిషాలు మాత్రమే. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు (ఎఫ్సిఆర్ఎ)ను అధ్యయనం, నివేదిక కోసం సంయుక్త సభా సంఘాని (జెపిసి)కి నివేదించారు. వర్షాకాల సమావేశాల్లో లోక్సభ సామర్థ్యం 19 శాతంగా, రాజ్యసభ సామర్థ్యం 39 శాతంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్ష నిరసనలు ఉభయ సభల సామర్థ్యాన్ని దెబ్బతీశాయని కూడా మంత్రి ఆరోపించారు. కీలకమైన అంశాలపై వివరణ ఇవ్వడానికి లేదా చర్చలు జరపడానికి సిద్ధంగా లేని కేంద్ర ప్రభుత్వం, వర్షాకాల సమావేశాలను గంగలో కలిపేశాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మోడీ, షా వైఖరితో స్తంభించిన పార్లమెంట్
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి ఘటన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయకపోవడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి. జూలై 20న ప్రారంభమై గురువారం ముగిసిన ఈ సమావేశాల్లో, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి సహా మరే అంశంపైనా చర్చ జరగలేదు. జూలై 20న జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల క్రూరమైన దాడి జరిగింది.








కామెంట్లు (0)