- పదో రోజుకు మహిళా సంఘాల ఐక్య ఆందోళన
- రాజ్యసభ సిపిఎం పక్షనేత జాన్ బ్రిట్టాస్ సంఘీభావం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. 'నేషనల్ కొయిలేషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్స్ (ఎన్సిడబ్ల్యుఆర్) ఆధ్వర్యాన జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఐక్య ఆందోళన శుక్రవారం నాటికి పదో రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది మహిళలు, కేరళ నుండి వచ్చిన భారీ ప్రతినిధి బృందం బ్యానర్లు, ప్లకార్డులు, పోస్టర్లు, జెండాలతో ఆందోళనలో భాగస్వాములయ్యారు. మహిళల రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్న వామపక్ష పార్టీల తరపున మద్దతు, సంఘీభావం తెలిపేందుకు రాజ్యసభ సిపిఎం పక్షనేత జాన్ బ్రిట్టాస్ ఆందోళన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ చట్టం అమలును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వ చర్యలను ఆయన 'మనువాద కుట్ర'గా అభివర్ణించారు. పోరాటంతో తమ హక్కులను ఎలా సాధించుకోవాలో దేశంలో మహిళలకు తెలుసునని అన్నారు. బిజెపి ద్వంద్వ వైఖరి ప్రజల ముందు బట్టబయలవుతుందని ఆయన స్పష్టం చేశారు. సభలో ఐద్వా జాయింట్ సెక్రటరీ, ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలు ఆశా శర్మ, ఐద్వా నాయకులు జాతీయ నాయకురాలు మైమూనా మొల్లా, ఎన్ఎఫ్ఐడబ్ల్యు నాయకులు అరుణ, రహీనా బేగం రాజ్, వైడబ్ల్యుసిఎ నాయకులు ప్రజ్ఞ, ఎఐపిడబ్ల్యుఎ నాయకులు పూజ తదితరులు ప్రసంగించారు. పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని పునరుద్ఘాటించారు. ధర్నాలో ఐద్వా అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.కె. శ్రీమతి, కనినిక ఘోష్, జాతీయ కార్యదర్శి సి.ఎస్. సుజాత, ఢిల్లీ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు ఆశా యాదవ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యు ప్రధాన కార్యదర్శి నిషా సిధు, ఎన్ఎఫ్ఐడబ్ల్యు నుండి దీప్తి, సరస్వతి, 'టుగెదర్ ఫర్ ట్రాంక్విలిటీ' నుండి భావన శర్మ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)