- మూడు నెలల పసికందుతో సహా ఐదుగురు మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని చంపా జిల్లాలో భారీ వర్షాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో మూడు నెలల పసికందు కూడా ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డు జారుడుగా మారడంతో కారు అదుపు తప్పింది. అనంతరం రోడ్డు పక్కనున్న లోతైన గుంతలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాత్రి వేళల్లో ప్రయాణాలు నివారించాలని, కొండ ప్రాంత రహదారులపై వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.








కామెంట్లు (0)