- జంతర్మంతర్లో నిరసన తెలిపిన ఉద్యోగులపై సంస్థల భిన్న వైఖరి
న్యూఢిల్లీ : ఢిల్లీలోని జంతర్మంతర్లో వేలాది మంది విద్యార్థులు, యువ ఉద్యోగులు పరీక్షా వ్యవస్థలో సమూల మార్పులు కోరుతూ మోడీ సర్కారుకు వ్యతిరేకంగా వారాల తరబడి ఆందోళనలు నిర్వహించారు. ఇందుకోసం కొందరు ప్రత్యేకంగా సెలవులు తీసుకుని వచ్చారు. మరికొందరు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ప్రయాణించి వచ్చి మరీ నిరసనల్లో పాల్గొన్నారు. ఉద్యమం ముగించుకొని తమ ఉద్యోగాలు, కళాశాలలకు తిరిగి వెళ్లిన తర్వాత వారికి వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి.
‘దేశాన్ని మార్చేసి వచ్చావా’ అంటూ... గురుగ్రామ్లోని ఓ ప్రకటన సంస్థలో పనిచేస్తున్న దీపాలి కపూర్ మాట్లాడుతూ... ‘‘నిరసన ఎలా జరిగిందని ఎవరూ అడగలేదు. ‘దేశాన్ని మార్చేసి వచ్చావా?’ అంటూ మేనేజర్ నవ్వుతూ అన్నారు. మేనేజర్ మాటలతో సహోద్యోగులు, సిబ్బంది నవ్వారు. నేనూ నవ్వాల్సి వచ్చింది. కానీ మేనేజర్ చేసిన ఆ వ్యాఖ్య వెనుక నన్ను ఎద్దేవా చేసే భావన ఉందని అర్థమైంది’’ అని తెలిపింది. జంతర్మంతర్ నిరసనల్లోనే పాల్గొన్న ఘజియాబాద్కు చెందిన మార్కెటింగ్ ఉద్యోగి దీక్షా శర్మను సహోద్యోగులు అభినందించడమే కాకుండా.. సమాజ సమస్యలపై యువత స్పందించడం అభినందనీయమని సీనియర్ అధికారులు ప్రశంసించినట్టు తెలిపింది. గురుగ్రామ్కు చెందిన ఓ సేల్స్ ఉద్యోగిని మాట్లాడుతూ.. ‘‘నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలని మేనేజర్ 20 నిమిషాల పాటు లెక్చర్ ఇచ్చారు. అది నాకు ఒక శిక్ష కంటే ఎక్కువగా అనిపించింది’’ అని వివరించింది. సోషల్ మీడియా కారణంగా ప్రతి ఫోటో, ప్రతి ట్వీట్, ప్రతి రీల్, ప్రతి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉద్యోగి డిజిటల్ గుర్తింపులో భాగమవుతోంది. చాలా మంది యువ ఉద్యోగులకు నిరసనల్లో పాల్గొనడం ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతగా కనిపిస్తుండగా.. కొన్ని యాజమాన్యాలు సోషల్ మీడియాపై నిఘాను పెంచుతున్నాయి.








కామెంట్లు (0)