భువనేశ్వర్ : ఒడిశాలో తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన చేపడుతున్న యాప్ ఆధారిత క్యాబ్, బైక్ డ్రైవర్లపై బుధవారం పోలీసులు విరుచుకుపడ్డారు. ఆందోళనకారులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 30మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణ చార్జీల పెంపు, అప్లికేషన్ ఫీజు తగ్గింపు, సామాజిక భద్రత సహా తమ ఏడు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు రోజులుగా క్యాబ్, బైక్ రైడర్లు ఆందోళనచేపడుతున్న సంగతి తెలిసిందే. వీరంతా వివిధ ప్రైవేట్ ఆన్లైన్ రైడ్ హెయిలింగ్ ఫ్లాట్ఫారమ్లలో నమోదైన క్యాబ్, బైక్ డ్రైవర్లు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైడింగ్లు నిలిపివేసి గత రెండు రోజుల నుండి ఆందోళన చేపడుతున్నారు.
ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం భువనేశ్వర్లోని రాజ్మహల్ స్క్వేర్ వరకు టాక్సీ, బైక్లతో ర్యాలీ చేపట్టిన అనంతరం మహాత్మా గాంధీ మార్గ్లో రహదారిని దిగ్బంధించారు. మాస్టర్ క్యాంటీన్, రైల్వేస్టేషన్ ఏరియాకు వెళ్లే ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వాహనాలను అక్కడి నుండి తొలగించాలని ఆదేశించారు. అయినప్పటికీ డ్రైవర్లు ఆందోళనను కొనసాగిస్తుండటంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. డ్రైవర్లు పోలీసులపై రాళ్లు రువ్వారని, పిఎంజి స్క్వేర్లో పార్క్ చేసిన పలు అమా ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేశారని భువనేశ్వర్ డిజిపి తెలిపారు. ఈ నిరసన చట్టవిరుద్ధమని అన్నారు. కేవలం ఆగస్టు 17న మాత్రమే ఆందోళన చేపట్టేందుకు అనుమతి తీసుకున్నారని అన్నారు. చట్టవిరుద్ధంగా వారు ఆందోళనను కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ యాప్లు ప్రైవేట్ సంస్థలకు చెందినవని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు.







కామెంట్లు (0)