ఆల్ట్ న్యూస్ పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ : సిజెపి ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించిన 'ఛలో పార్లమెంట్' కార్యక్రమంలో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన పాశవిక దాడుల వివరాలు మోడీ సర్కారు దుర్మార్గాన్ని ఎత్తిచూపుతున్నాయి. పోలీసులు మేకులు అమర్చిన లాఠీలతో విద్యార్థులపై దాడి చేశారనే ఆరోపణలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరలయ్యాయి.
ఆ వీడియోలు నిజమే : స్వతంత్ర ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ ఆల్ట్ న్యూస్
ఈ వీడియోలు నకిలీవని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అనంతరం పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందిస్తూ .... వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అని, ఢిల్లీ పోలీసులు మేకులున్న లాఠీలను ఉపయోగించలేదని పేర్కొంది. స్వతంత్ర ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ ఆల్ట్ న్యూస్ నిర్వహించిన పరిశీలనలో .... ఆ వీడియోలు నిజమైనవేనని నిర్థారణ అయినట్లు తన కథనంలో స్పష్టం చేసింది. దీంతో ఈ అంశంపై మరింత చర్చ మొదలైంది.
పెల్లెట్ గన్స్తో దాడి చేశారు : మీడియాతో బాధిత యువకులు
'చలో పార్లమెంట్'లో తమపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించారని పలువురు విద్యార్థులు తెలిపారు. గాయపడిన పలువురు విద్యార్థులు మీడియా ఎదుట తమ అనుభవాలను వెల్లడించారు. ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల యువకుడు మీడియాతో మాట్లాడుతూ .... పార్లమెంట్ మార్చ్లో పాల్గొంటున్న సమయంలో పోలీసులు తనపై పెల్లెట్ గన్స్తో కాల్పులు జరిపారని తెలిపాడు. తనకు తగిలిన గాయాలను పరిశీలించిన సఫ్దర్జంగ్ ఆసుపత్రి వైద్యుల నివేదికలు కూడా అదే విషయాన్ని సూచిస్తున్నాయని వివరించాడు. మరో 19 ఏళ్ల విద్యార్థి మాట్లాడుతూ .... పెల్లెట్ గన్స్ దాడి కారణంగా తన ఒక కన్ను చూపు మందగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే ఘటనలో మరో యువకుడు కూడా గాయపడినట్లు ప్రముఖ మీడియా వెల్లడించింది. తమతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా ఇలాంటి దాడులకు గురయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం, పెల్లెట్ గన్స్ వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.








కామెంట్లు (0)