- ప్రధాని మోడీ యాంగ్రీ అంకుల్స్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే ఆగ్రహం
న్యూఢిల్లీ : విమర్శనాత్మక ప్రశ్నలను అణిచివేయడానికి, పాలనాపర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నేతలు పదేపదే ప్రతిపక్షాలపై రకరకాల ముద్రలు వేస్తూ దుష్ప్రాచారం సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 5న ఢిల్లీ యూనివర్సిటిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సిసి) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం ఏ అభివృద్ధి పని చేసినా..దీని అవసరం ఏమిటీ? అంటూ కొందరు ‘యాంగ్రీ అంకుల్స్’ పశ్నిస్తుంటారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్య, ఉద్యోగాలు, యువజన సంక్షేమం గురించి మాట్లాడకుండా, దానిని రాజకీయ ప్రచారంగా ప్రధాని మోడీ మార్చేశారని ఖర్గే అన్నారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై ఇలాంటి రాజకీయ ముద్రలు వేస్తున్నారని విమర్శించారు. విమర్శనాత్మక ప్రశ్నలను అణచివేయడానికి, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి విపక్షాలను కించపరిచే విశేషణాలను వాడడం మోడీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రధాని మోడీ- మీరు నిన్న ఢిల్లీ యూనివర్సిటీలోని ఎస్ఆర్సిసిని సందర్శించారు. దేశ యువత, విద్య, వారి భవిష్యత్తుపై మాట్లాడడానికి అది ఒక మంచి అవకాశం. కానీ మీరు యువత వేసే ప్రశ్నలను ఎదుర్కొనేందుకు బదులుగా, మీ ప్రసంగం కాస్త మరో రాజకీయ ప్రచారంగా మార్చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలను అణచివేయడానికి, సొంత వైఫల్యాలను దాచడానికి మీరు ప్రతిపక్షాలకు కొత్త విశేషణాలను సృష్టిస్తున్నారు. నారాజ్ ఫూఫా (కోపదారి మేనమామ), దిమాగీ నక్సల్, అర్బన్ నక్సల్, ఖాన్ మార్కెట్ గ్యాంగ్, ఆందోళనజీవి, పరాన్నజీవి ఇలా చాలా విశేషణాలు మారుతూ ఉన్నప్పటికీ, మీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు మాత్రం మారడం లేదు." అని ఖర్గే పోస్టు చేశారు.
యువత సమస్యలు పట్టవా?
యువత రిపోర్ట్ కార్డులో పెరుగుతున్న నిరుద్యోగం, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ప్రభుత్వ నియామకాలు, పేపర్ లీక్లు, ఖరీదైన విద్య, తగ్గిపోతున్న స్కాలర్షిప్ అవకాశాలు, విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిపై పెరుగుతున్న ఒత్తిడి లాంటివి పెను సమస్యలుగా కోరలు చాచినా మోడీ సర్కార్కు పట్టడం లేదని ఖర్గే విమర్శించారు. ‘మోడీ- మీరు అందనంత దూరంలో ఉన్నప్పుడే మీకు ప్రత్యేక పరిచయ కార్యక్రమం అవసరం అవుతుంది. మోడీ తన రిపోర్టు కార్డు చూపించారు. దేశ యువత కూడా తన రిపోర్టు కార్డుతో సిద్ధంగా ఉంది. ఆ రిపోర్టు కార్డులో నిరుద్యోగం, ఏళ్ల తరబడి నిలిచిపోయిన ప్రభుత్వ నియామకాలు, పేపర్ లీక్లతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులు, రోజురోజుకూ ఖరీదు అవుతున్న విద్య, తగ్గిపోతున్న స్కాలర్షిప్ అవకాశాలు, యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిపై పెరుగుతున్న ఒత్తిడి మొదలైనవి ఉన్నాయి. అందుకే విద్యార్థుల గొంతుక వినండి. సమస్యను పక్కదారి పట్టించడం వల్ల అవి పరిష్కారం కావు" అని ఖర్గే అన్నారు.








కామెంట్లు (0)