- రెండున్నరేళ్ల బాలుడితో సహా ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
ముంబై: ముంబైలోని పార్లే వెస్ట్లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 12 అంతస్తుల భవనంలోని 11వ అంతస్తులో చెలరేగిన మంటల్లో రెండున్నరేళ్ల బాలుడితో సహా ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 10.02 గంటలకు అగ్నిప్రమాదంపై ముంబై అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. సుమారు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విద్యుత్ వైరింగ్, సంబంధిత వ్యవస్థలు, ఏసీ యూనిట్, గృహోపకరణాలు, సోఫా, మంచం, ఫాల్స్ సీలింగ్, వంటగది పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రాత్రి 10.08 గంటలకు అగ్నిప్రమాదాన్ని లెవెల్-1గా ప్రకటించిన అధికారులు.. మంటల తీవ్రత పెరగడంతో 10.16 గంటలకు లెవెల్-2గా మార్చారు. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించిన అనంతరం తెల్లవారుజామున 1 గంటకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని కూపర్, నానావతి ఆసుపత్రులకు తరలించారు. కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన 30 ఏళ్ల అగ్నిమాపక సిబ్బంది మనోజ్ సోనవన్, 29 ఏళ్ల శివం ద్వివేది స్వల్ప గాయాలతో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. నానావతి ఆసుపత్రికి తరలించిన రెండున్నరేళ్ల అబీర్, 23 ఏళ్ల అంకిత చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన పార్థ్ (32), హిరణ్ (64), యశస్వి (33), అభిషేక్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. యశస్వి, అభిషేక్ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, మంటలు ఎలా చెలరేగాయనే అంశాలపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.








కామెంట్లు (0)