ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అస్సాంలో వరదల బీభత్సం..

06 ఆగస్టు, 2026

assam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 09:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 95కు చేరిన మృతుల సంఖ్య

- 14 జిల్లాలకు హెచ్చరిక

గౌహతి : అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పరిస్థితి మరింత విషమించింది. గత 24 గంటల్లో మరో ఆరుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 95కు చేరింది. ప్రస్తుతం 14 జిల్లాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 563 గ్రామాల్లో 1.6 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. శివసాగర్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమై, అక్కడ 57 వేల మందికిపైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నుమాలిగఢ్ ప్రాంతంలోని ధన్‌సిరి (ఎస్) నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో గోలాఘాట్, లఖింపూర్, చరాయిదేవ్, శివసాగర్, బిశ్వనాథ్, ధేమాజి, కామరూప్ మెట్రో, జోర్హాట్, సోనిత్‌పూర్, టిన్సుకియా, నాగావ్, దారంగ్, కర్బీ ఆంగ్లాంగ్, ఉదల్‌గురి జిల్లాల్లో అప్రమత్తత ప్రకటించారు. వరదల కారణంగా రాష్ట్రంలో మొత్తం ఏడు చోట్ల రహదారి కోతలు నమోదయ్యాయి. వాటిలో ఐదు బిశ్వనాథ్ జిల్లాలో, రెండు దారంగ్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. చరాయిదేవ్‌లోని ఉక్కు వంతెన, ఉదల్‌గురిలోని పాదచారుల వంతెన కూడా దెబ్బతిన్నాయి. గౌహతితో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సత్గావ్, హతిగావ్ ప్రాంతాల నుంచి సుమారు 80 మందిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 45 సహాయ శిబిరాల్లో 12,356 మందికి ఆశ్రయం కల్పించగా, 59 పంపిణీ కేంద్రాల ద్వారా 32 వేల మందికి పైగా బాధితులకు బియ్యం, పప్పుధాన్యాలు, ఉప్పు, పశుగ్రాసం తదితర నిత్యావసరాలను అందిస్తున్నారు. వరదల ప్రభావంతో 16,951 హెక్టార్ల వ్యవసాయ భూమి నీటమునిగింది. అలాగే 35 వేలకుపైగా పశువులు ప్రభావితమవగా, సుమారు 8,500 జంతువులు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్