- సుప్రీంకు తెలియచేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఇంగ్లీషును మాతృభాషగా పరిగణించడం పట్ల తమకు అభ్యంతరం వుందని బుధవారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంగ్లీషును విదేశీ భాష లేదా స్థానికేతర భాషా విభాగంలో చేర్చాలా వద్దా అనే అంశంపై తమ వాదనలను వినిపించాలనుకుంటున్నామని తెలిపింది. 10వ తరగతిలో థర్డ్ లాంగ్వేజ్ బోర్డు పరీక్షకు తప్పనిసరిగా హాజరవడం నుండి ప్రస్తుత 6వ తరగతి విద్యార్ధులకు ఒకసారి ఉపశమనం ఇచ్చే విషయాన్ని అత్యవసరంగా పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై చర్చలు జరిపే అవకాశం వుందని తెలిపింది.
త్రిభాషా విధానాన్ని అమలు చెయాల్సిందే..
ఈ త్రిభాషా విధానంలో పరీక్షలను తొలిసారిగా ఎదుర్కొనేది ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్ధులే, అందువల్ల ఆ విద్యార్ధుల తల్లిదండ్రులు ఈ విషయంలో ఆత్రుత కనబరుస్తున్నారు. సిబిఎస్ఇ త్రి భాషా విధానంపై కేసును చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తోంది. త్రి భాషా విధానాన్ని అంతిమంగా అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే, ఇందుకోసం విద్యార్ధులు, పాఠశాలలకు తగినంత సమయం అవసరమని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఉపాధ్యాయులను, మౌలిక వసతులను కూడా తగినరీతిలో సమకూర్చుకోవాల్సి వుందని అన్నారు. భాషను నేర్చుకోవడమనేది చాలా చిన్న వయస్సు నుండే అరంభం కావాలని కోర్టు ఈ సందర్భంగా సూచించింది. అప్పుడే వారికి పూర్తి స్థాయిలో అలవాటు పడేందుకు తగిన సమయం వుంటుందని పేర్కొంది. ఈ వ్యవహారాలు చూస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి వ్యక్తిగత కారణాల రీత్యా న్యాయస్థానానికి హాజరు కానందున కోర్టు ఈ కేసు విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.








కామెంట్లు (0)