- అస్సాం ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ : రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ ఐదుగురు మహిళలను విదేశీయులుగా ప్రకటిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై రెండు వారాల్లోగా స్పందించాల్సిందిగా అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఆ ఐదుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడానికి సమయం కావాలని అస్సాం ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కోరడంతో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ పై ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల తర్వాత ఈ అంశాన్ని విచారణకు పెట్టాల్సిందిగా ఆదేశిస్తూ ఈ నెల 16న ఆదేశించింది. గౌహతి హైకోర్టు విడివిడిగా జారీ చేసిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఆ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణకు సుప్రీం అంగీకరించింది. పిటిషనర్ల తరలింపుపై యథాతథ స్థితిని పాటించాల్సిందిగా జూన్ 5న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఐదుగురిలో ఇద్దరు మహిళలు నిర్బంధంలో వున్నారని కొంతమంది పిటిషనర్ల తరపు న్యాయవాది పేర్కొన్నారు. వారి తరలింపుపై సుప్రీం స్టే ఇచ్చిందన్నారు. బంగ్లాదేశ్ నుండి భారత్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ వారిని విదేశీయులుగా ప్రకటిస్తూ విదేశీయుల ట్రిబ్యునళ్లు జారీ చేసిన ఆదేశాలను కొట్టివేయాలని పిటిషనర్లు గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ అంశాలపై నిర్ణయించాలని, గతంలో ఏ హైకోర్టు లేదా ట్రిబ్యునల్ చేసిన ఎలాంటి వ్యాఖ్యలతోనూ ప్రభావితం కారాదని ట్రిబ్యునళ్ళను సుప్రీంకోర్టు కోరింది. అదేసమయంలో ఇటువంటి హోదాలను నిర్ధారించే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, సహేతుకంగా, సక్రమంగా వుండాలని కోర్టు సూచించింది.








కామెంట్లు (0)