బీజింగ్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
ఇరు దేశాల విశ్వాసాన్ని పటిష్టం చేసుకుందాం : చైనా
బీజింగ్: భారత్, చైనాల మధ్య మైత్రి మరింత బలపడుతోందని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్ పేర్కొన్నారు. సరిహద్దు అంశంపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భాగంగా, చైనా విదేశాంగ మంత్రి, పొలిట్బ్యూరో సభ్యుడు వాంగ్ యీతో దోవల్ మంగళవారం బీజింగ్లో 25వ విడత విస్తృత సంప్రదింపులు జరిపారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్నాయని దోవల్ తెలిపారు. అదేవిదంగా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతలను మరింత బలోపేతం చేసేందుకు, సుస్థిరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించినట్టు ఆయన తెలిపారు. ‘‘గత ఏడాది కాలంగా రెండు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడం పట్ల నేను సంతోషిస్తున్నాను. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతలను ఇరుపక్షాలు కాపాడటం వల్లే ఈ సాధారణ స్థితి సాధ్యమైంది’’ అని ఆయన పేర్కొన్నారు.
విజయాల్లో కలిసి నడుద్దాం : చైనా
ప్రముఖ వర్థమాన దేశాలైన భారత్, చైనా పరస్పరం విజయాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆకాంక్షించారు. రెండు దేశాల సంబంధాలు ద్వైపాక్షిక పరిధిని దాటి ప్రపంచ, వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకున్నాయని అన్నారు. పరస్పర సమాచార మార్పిడిని పెంచుకోవడం, విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడం, అవాంతరాలను తొలగించుకోవడం, అడ్డంకులను అధిగమించడం ముఖ్యమని, మంచి పొరుగు దేశాలుగా, ఒకరి విజయానికి మరొకరు తోడ్పడే భాగస్వాములుగా ఉండాలని వాంగ్ యూ అన్నారు. గత చర్చల్లో, సరిహద్దుల నిర్ధారణ, సరిహద్దు నిర్వహణ, యంత్రాంగాల నిర్మాణం, సరిహద్దు దాటి సహకారంపై ఇరుపక్షాలు ఉమ్మడి అవగాహనకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
భారత్కు షీ జిన్పింగ్..
దోవల్, వాంగ్ యీ తొలుత 90 నిమిషాలకు పైగా తమ బృందాలతో కలిసి చర్చలు జరిపారు. అంతకుముందు దోవల్ చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ను కూడా కలిశారు. రాబోతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఈ విడత చర్చలు అత్యంత కీలకమైనవని దోవల్, మీడియా సమక్షంలో వాంగ్ యీకి తన ప్రారంభోపన్యాసంలో తెలిపారు. వచ్చే నెల 12న న్యూఢిల్లీలో జరిగే ఈ సదస్సుకు షీ జిన్పింగ్ హాజరుకానున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారత్లో పర్యటించనుండడం గమనార్హం.








కామెంట్లు (0)