- విద్యార్థి ఉద్యమంతో రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి
- ప్రభుత్వ వ్యతిరేకత, పోలీసు అణచివేతతో దేశవ్యాప్తంగా విస్తరించిన విద్యార్థి ఉద్యమం
న్యూఢిల్లీ : పరీక్షా పత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు, మూల్యాంకనంలో లోపాలపై ప్రారంభమైన విద్యార్థులు, యువత ఉద్యమం ఇప్పడు దేశంలో కొత్త సంచలనంగా మారింది. నిజానికి నిరసనలను పోలీసు బలప్రయోగంతో అణచివేయాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నించడమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి దారి తీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు బిజెపికి కూడా రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి వైపునకు తీసుకుని వెళ్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆన్లైన్లోనూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రాంభమైన ఉద్యమం ప్రభుత్వ వ్యతిరేకత, పోలీసు అణచివేతతో దేశవ్యాప్తంగా విస్తరించిందని విశ్లేషకులు అంటున్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత కోరిన యువత ఉద్యమాన్ని ప్రభుత్వం బలప్రయోగంతో ఎదుర్కోవాలని చూసింది. చివరకు అది క్రమంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమంగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు. న్యూఢిల్లీలో పార్లమెంట్ వెలుపల వేలాది మంది విద్యార్థులు పరీక్షా అవకతవకల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దిగిన నిరసనను అణచివేయడానికి పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జి ప్రయోగించి వారిని చెదరగొట్టారు. దీంతో పరిపాలనా వైఫల్యాలపై ప్రారంభమైన నిరసన, ఈ పోలీసు చర్యల తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారిందని, దేశవ్యాప్తంగా విస్తరంచిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. చివరికి లండన్ నుంచి సిడ్నీ వరకు ప్రవాస భారతీయులు కూడా సంఘీభావ ప్రదర్శనలు చేశారని వెల్లడించారు.
రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి
2024 లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ కోల్పోయిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారాన్ని విస్తరించడంపై బిజెపి దృష్టి పెట్టింది. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన అనంతరం ఉత్తర భారత్లోని రాష్ట్రాలకు అనుకూలంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ కూడా ప్రారంభమైంది. అయితే ఇలాంటి రాజకీయ వ్యూహాలతో సామాన్య ప్రజల, యువత అసంతృప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ని తక్కువ అంచనా వేసిన మోడీ ప్రభుత్వం
నిరుద్యోగ యువతను ఎగతాళి చేస్తూ రూపొందించిన ఒక ఏఐ మీమ్తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఉద్యమాన్ని ప్రభుత్వం మొదట సీరియస్గా తీసుకోలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఒకే డిమాండ్తో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని చర్చల ద్వారా పరిష్కరించకుండా పోలీసు బలప్రయోగంతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రభుత్వం చేసిన రెండో పెద్ద తప్పిదంగా మారింది.







కామెంట్లు (0)