ముంబై: ఐఐటీ బాంబేలోని పవయీ క్యాంపస్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పరీక్ష హాల్లో మొబైల్ ఫోన్ వినియోగిస్తూ పట్టుబడిన కొద్దిరోజులకే అతడు హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
ఇన్స్టిట్యూట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ (19) ఇటీవల పరీక్ష రాస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించారు. ప్రశ్నపత్రాన్ని చాట్జీపీటీలో అప్లోడ్ చేస్తుండగా పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంలో అతడిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అయితే, విభాగాధిపతి సాహిల్ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
అయినప్పటికీ సాహిల్ ఆత్మహత్యకు పాల్పడటం క్యాంపస్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాది ఐఐటీ బాంబేలో చోటుచేసుకున్న నాలుగో మరణం ఇదని విద్యార్థులు పేర్కొన్నారు. వరుస ఘటనలపై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శుక్రవారం రాత్రి క్యాంపస్లో ఆందోళన చేపట్టారు. నిరసనల నేపథ్యంలో క్యాంపస్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.








కామెంట్లు (0)