- జైలులో సీసీబీ సోదాలు
- సెల్లో మొబైల్ ఫోన్, ఛార్జర్ స్వాధీనం
- అసిస్టెంట్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
బెంగళూరు: అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన మాజీ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న జైలు సెల్లో మొబైల్ ఫోన్, ఛార్జర్ లభించడం కలకలం రేపింది. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నిర్వహించిన సోదాల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. జైలులోని ప్రముఖ ఖైదీల సెల్లలో సీసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు జైలు డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ఈ సోదాలు నాలుగు నుంచి ఐదు గంటల పాటు కొనసాగినట్లు వెల్లడించారు. ప్రజ్వల్ రేవన్న సెల్లో మొబైల్ ఫోన్, ఛార్జర్ గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీఐజీ సమర్పించిన నివేదిక ఆధారంగా జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయడంతో పాటు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీజీపీ వెల్లడించారు. జైలులో నిషేధిత మొబైల్ ఫోన్కు ఎలా ప్రవేశం లభించిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రజ్వల్ రేవన్నను మొదటి నిందితుడిగా, ఆయనకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తోటి ఖైదీ ప్రతాప్ రాయ్ను మరో నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. జైలులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫామ్హౌస్లో పనిమనిషిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రజ్వల్ రేవన్న దోషిగా తేలడంతో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆయన మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు. ప్రజ్వల్పై మరో మూడు అత్యాచారం కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. జైలు సెల్లో మొబైల్ ఫోన్ లభించిన ఘటనతో ప్రజ్వల్ రేవన్నకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు లేదా వీఐపీ తరహా పరిగణన లభిస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.








కామెంట్లు (0)