-- భద్రత కల్పిస్తామని హామీ
ఛత్రపతి శంభాజీనగర్ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకులు అభిజిత్ ధీప్కే తల్లిదండ్రులతో మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత సంజయ్ శిర్సత్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ఛత్రపతి శంభాజీనగర్లోని వారి నివాసానికి వెళ్లి ఆయన భేటీ అయ్యారు. అభిజిత్కు అధికారికంగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సంజయ్ మాట్లాడుతూ అభిజిత్ రెండుమూడ్రోజుల్లో స్వస్థలానికి వస్తారని, మహారాష్ట్ర చేరుకోగానే అధికారిక భద్రత కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను తాను విజ్ఞప్తి చేశానని తెలిపారు. అభిజిత్ ప్రాణాలకు ఎటువంటి మప్పు ఉండబోదని భరోసా కల్పించారు. కాగా అభిజిత్ దీప్కే జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో ఇదే శివసేన భాగస్వామిగా ఉన్న మహాయుతి ప్రభుత్వంలోని ఒక మంత్రి అక్కడ ధర్నా చేస్తున్న విద్యార్థులను, యువకులను ఉగ్రవాదులు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అభిజిత్ కుటుంబ సభ్యులను కలిసి తొలి రాజకీయ నేత సంజయ్ కావడం గమనార్హం. అయితే అభిజిత్ కుటుంబంతో తనకు సంబంధాలున్నాయని, అందువల్లే అభిజిత్ ఆందోళన చేస్తున్న సమయంలో రాజకీయ విమర్శలకు తావివ్వరాదనే తాను ఇన్నాళ్లూ దీప్కే కుటుంబాన్ని కలుసుకోలేదని మంత్రి సంజయ్ తెలిపారు. ఇదే విషయాన్ని అభిజిత్ తండ్రి భగవాన్ దీప్కే కూడా పేర్కొన్నారు. మంత్రి సంజయ్ వద్ద తాను 15 సంవత్సరాలు పని చేశానని, నిరసనల సమయంలో అనేక మంది నాయకులు కలవడం, ఫోన్ చేసి మాట్లాడటం చేసినా..సంజయ్ కనీసం ఫోన్ కూడా చేయకపోవడంపై సంశయించానని, ఇప్పుడు వ్యక్తిగతంగా కలవడంతో సంశయానికి సమాధానం దొరికిందన్నారు. రాజకీయ రంగు పులుముకునే వీలుకల్పించరాదనే భేటీ కాలేదన్న మంత్రి సంజయ్ నిర్ణయం సరైనదేని తెలిపారు.








కామెంట్లు (0)