రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడంతో క్షీణించిన ఆరోగ్యం
ముంబయి : మరాఠా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ఉద్యమవేత్త మనోజ్ జరాంగే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారంతో 11వ రోజుకు చేరుకుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా పడిపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో వైద్యుల సూచన మేరకు సెలైన్ తీసుకునేందుకు ఆయన అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. జరాంగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయాయని, ఆయన బరువు కూడా 52 కిలోల నుంచి 45 కిలోలకు తగ్గినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటల వరకు ఆయనకు నాలుగు బాటిల్స్ సెలైన్ ఎక్కించామని అన్నారు. మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్, ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ ఫోన్ ద్వారా జరాంగేతో జరిపిన చర్చల అనంతరం ఆయన చికిత్సకు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. జరాంగే డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుందని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
మరాఠా సమాజానికి ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జరాంగే ఆగస్టు 29 నుండి మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంతర్వాలి సార్తి గ్రామంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, సతారా గెజిట్ రికార్డులను అమలు చేయడంతో పాటు, మరాఠా సమాజంలోని అర్హులైన వారికి కున్బీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతున్నారు. మరాఠా ఉద్యమానికి మద్దతుగా సెప్టెంబరు 12న అంతర్వాలి సార్తి వద్ద భారీ సంఖ్యలో ప్రజలు సమావేశం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పూనే, థానే, నాసిక్, ముంబయి తదితర ప్రధాన జిల్లాల నుంచి మరాఠాలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.








కామెంట్లు (0)