తాష్కెంట్ చేరుకున్న ప్రధాని
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఆసియా పర్యటన ప్రారంభమైంది. శనివారం ఆయన ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్ చేరుకున్నారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకూ ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించనున్నారు. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఒ) శిఖరాగ్ర సమావేశం కోసం ఇక్కడికి చేరుకున్న ప్రధాని ఇరు దేశాల నేతలతో చర్చలు జరపనున్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్తో ప్రతినిధుల స్థాయి చర్చలు జరపనున్నారు. పర్యటనకు ముందు ఇచ్చిన ప్రకటనలో, ఇటీవలి కాలంలో భారత్-ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం గణనీయమైన పురోగతిని సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ అనుసంధానం, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించడంపై, వికసిత్ భారత్, నవ ఉజ్బెకిస్థాన్ అనే ఉమ్మడి లక్ష్యాలను సాధించడంపై అధ్యక్షుడు మిర్జియోయేవ్తో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. తాష్కెంట్ నుండి, 26వ ఎస్సిఒ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోడీ బిష్కెక్ వెళ్తారు. ఎస్సిఒలో 2017 నుంచి ఇండియా క్రియాశీలక సభ్య దేశంగా ఉందని, శాంతి, స్థిరత్వాలకు ముప్పు కలిగిస్తున్న ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాద ముప్పు లేని ప్రాంతాన్ని నిర్మించేందుకు ఇతర సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని ప్రధాని పేర్కొన్నారు. బిష్కెక్ పర్యటనలో, ఆ దేశ అధ్యక్షుడు జపరోవ్, ఇతర ఎస్సిఒ నాయకులతో సమావేశమవుతారు. 6వ 'వరల్డ్ నోమాడ్ గేమ్స్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.








కామెంట్లు (0)