- పోటీ పేరుతో వందల కోట్ల విరాళాలు దండుకున్న వైనం
న్యూఢిల్లీ : గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, కేవలం కాగితాలకే పరిమితమైన పార్టీల ద్వారా మనీ లాండరింగ్ జరుగుతోందా ? అంటే అవుననే చెప్పాలి. కేవలం ఎన్నికల ముందే పుట్టి ఎన్నికల తర్వాత వాటి కార్యకలాపాలు కనుమరుగవుతున్న కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ పేరు చెప్పి వందల కోట్ల విరాళాలు సంపాదిస్తున్నాయి. ఇంతాచేసి వారు పోటీ చేసేది ఒకటో రెండు స్థానాలు కూడా వుండవు, అవైనా గెలుస్తారో లేదో కూడా తెలీదు. కానీ ఈ రూపేణా కోట్లాది మొత్తాలను మిగుల్చుకుంటారు.
గుజరాత్కి చెందిన న్యూ ఇండియా యునైటెడ్ పార్టీకి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు చూసినట్లైతే 2024 లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లో ఈ పార్టీ కేవలం మూడు లోక్సభ స్థానాలకు మాత్రమే పోటీ చేసింది. కేవలం 8542 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా కానీ రాజకీయ విరాళాల పేరిట రూ.290కోట్ల మొత్తాలను కూడగట్టుకుంది.
ఇక ఈ పార్టీ ఎన్నికల కోసం చేసినట్లుగా చెబుతున్న ఖర్చుల పట్టిక చూస్తే, లౌడ్ స్పీకర్లు, మైక్లను అద్దెకు తీసుకున్నందుకు ఏకంగా రూ.20.70కోట్లు చెల్లించింది. అలాగే కరపత్రాలు, బ్యానర్ల కోసం రూ.26.33కోట్లు ఖర్చు చేసింది. జెండాల కోసం రూ.20.99కోట్లు, ఎన్నికల ప్రచారాల కోసం రూ.92.77కోట్లు ఖర్చు పెట్టామని ఇక ర్యాలీలు, ఆహారం కోసం రూ.75.90కోట్లు వ్యయం చేశామని ఆ పార్టీ చెప్పుకుంది. ఇవన్నీ ప్రత్యక్ష వ్యయం కాగా, పరోక్ష వ్యయం కేటగిరీలో అకౌంటెంట్, బ్యాంకుల ఫీజులు, న్యాయ నిపుణులకు ఉద్యోగుల వేతనాలకు, ఆఫీసు నిర్వహణకు అయిన ఖర్చుల కింద 90లక్షలకు పైగా చూపించింది. ఈ మొత్తం వ్యవహారంలో లాభాన్ని కేవలం రూ.1.46కోట్లుగా చూపింది. ఇదంతా చూస్తుంటే మొత్తంగా వ్యవస్థను పూర్తి స్థాయిలో అవహేళన చేయడమే కనిపిస్తోంది.







కామెంట్లు (0)