- పాక్లోని బ్రాడ్ పీక్ పర్వతంపై భారీ హిమపాతం
- పుర్ణా సహా మరో తొమ్మిది మంది మృతి
ఖాట్మండు : ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా (43) పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బ్రాడ్ పీక్ పర్వతంపై సంభవించిన భారీ హిమపాతంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన నేతృత్వంలోని అంతర్జాతీయ బృందంలోని తొమ్మిది మంది సభ్యులు కూడా ఈ దుర్ఘటనలో మరణించారని క్లైంబింగ్ సంస్థ ఎలైట్ ఎక్స్పెడిషన్స్ సోషల్ మీడియాలో తెలిపింది. బ్రిటీష్ - నేపాలీ మూలాలున్న పుర్జా ఈ యాత్రకు నాయకత్వం వహించారు. ఈ బృందంలో పుర్జా బ్రిటన్ గుర్ఖా బ్రిగేడ్లో, ఆ తర్వాత రాయల్ మెరైన్స్కు చెందిన స్పెషల్ బోట్ స్క్వాడ్రన్లో సేవలందించారు. అనంతరం పూర్తిస్థాయి పర్వతారోహకుడిగా మారి అనేక రికార్డులు నెలకొల్పారు. 2019లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కేవలం ఆరు నెలల ఆరు రోజుల్లో ఆక్సిజన్ లేకుండా ప్రపంచంలోని 14 ‘‘‘ఎనిమిది వేల మీటర్ల’’ శిఖరాలను అధిరోహించి రికార్డు సృష్టించారు. గురువారం సంభవించిన ఈ హిమపాతం కారణంగా బృందంతో సంబంధాలు తెగిపోయాయి. అత్యంత ఎత్తైన ప్రాంతంలో సాగిన సెర్చ్ ఆపరేషన్లో ఇప్పటివరకు ముగ్గురు పర్వతారోహకుల మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. వీరు అమెరికాకు చెందిన మల్లోరీ గీస్, ఒమన్కు చెందిన నధీరా అహ్మద్ అబ్దుల్లా అల్ హర్తి, నేపాల్కు చెందిన పూర్ బహదూర్గా పాక్ ప్రభుత్వం గుర్తించింది. మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించి, గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. మిగిలిన వారి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర శా పుర్జాతోపాటు ఇతర మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన పర్వతారోహకుల ధైర్యం, అంకితభావం, సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.








కామెంట్లు (0)