- బిజెపి పదాధికారుల సమావేశంలో తీర్మానం
న్యూఢిల్లీ : మత ప్రస్తావనలతో కూడిన ‘వందేమాతరం’ పూర్తి నిడివి గేయాన్ని రాజకీయ అస్ర్తంగా చేసుకోవడానికి బిజెపి వ్యూహాలు పన్నుతోంది. మత ప్రస్తావనలున్న భాగాలను మినహాయించి దేశమంతటా ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించడం సాధారణంగా ఉన్నదే. అయితే దీనికి మత ప్రస్తావనలు కూడా జత చేసి పూర్తి నిడివి గేయాన్ని ఆలపించాలన్నది బిజెపి వాదన. ఇటీవల సంస్థాగత మార్పుల కారణంగా కొత్త నాయకత్వంతో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధ్యక్షతన ఆ పార్టీ నూతన పదాధికారుల సమావేశం శనివారం నిర్వహించారు. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ "బుజ్జగింపు రాజకీయాలకు" పాల్పడుతోందని ఈ సమావేశంలో ఆరోపించారు. వందేమాతరం గేయంలోని కేవలం రెండు చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. వందేమాతరం ఘనమైన వారసత్వాన్ని దేశం నలుమూలలా వ్యాప్తి చేయడానికి భారీ ప్రచారాన్ని కూడా చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ తీర్మానానికి సంబంధించిన వివరాలను నితిన్ నబీన్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వందేమాతరాన్ని "స్వచ్ఛమైన జాతీయ భావానికి, సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదంగా అభివర్ణించిన మహాత్మా గాంధీ ప్రకటనను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఆరు చరణాలతో కూడిన సంపూర్ణ జాతీయ గేయాన్ని, వందేమాతరంతో ముడిపడిన దేశ స్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలను యువత అర్థం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.








కామెంట్లు (0)