న్యూఢిల్లీ : యుపిఐ లావాదేవీలపై చార్జీలు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు పార్టీ పొలిట్బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. డిజిటల్ ఇండియా పేరుతో డిజిటల్ చెల్లింపులు, యుపిఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ని ఉచితంగా ప్రజలకు అందించే సేవగా పెంచి పోషించడానికి మోడీ ప్రభుత్వం దూకుడుగా ప్రయత్నించింది. నగదు చెల్లింపులు నిలిపివేసి, డిజిటల్ లావాదేవీలను ఉపయోగించా లంటూ ప్రధాని మోడీ ప్రజలకు, చిన్న వ్యాపారులకు, వ్యాపారవేత్తలకు పదే పదే పిలుపిచ్చారు. అభ్యర్ధించారు. యుపిఐని ప్రోత్సహించే ప్రైవేట్ పేమెంట్స్ కంపెనీతో సహా పలు వాణిజ్య ప్రకటనల్లో స్వయంగా ప్రధానే కనిపించారు. వాస్తవానికి, ఈ ప్రచారాన్ని పెద్ద నోట్ల రద్దుకు ఒక సమర్ధనగా కూడా చూపించారని పేర్కొంది.
ఇప్పడు సామాన్య పౌరులు కూడా చెల్లింపులు/లావాదేవీలకు దీన్నొక సాధనంగా స్వీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ మౌలిక సదుపాయంగా వున్న ఈ డిజిటల్ చెల్లింపులపై లావాదేవీల చార్జీలను విధించాలని ప్రతిపాదించడం ద్వారా ఒక ఆదాయ వనరుగా మార్చుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోందని పొలిట్బ్యూరో విమర్శించింది. యుపిఐ ఎప్పటికీ ఉచితంగానే వుంటుందంటూ ఇప్పటివరకు చెప్పకుంటూ వచ్చిన ప్రభుత్వం ఇప్పడిలా వ్యవహరించడం ప్రజా విశ్వాస ఉల్లంఘన కిందకు వస్తుందని విమర్శించింది. ఈ చర్యనొక్కదాన్ని వేరుగా చేసి చూడలేం. గత దశాబ్ద కాలంగా, ప్రజలపై అనేక బ్యాంకింగ్ సంబంధిత చార్జీలను నెమ్మదిగా పెంచుతూ వచ్చారు. కనీస బ్యాలెన్స్లు కొనసాగించకపోతే పెనాల్టీలు విధించడం, నిర్దేశిత పరిమితులకు మించి ఎటిఎం లావాదేవీలు జరిపితే అధిక చార్జీలు మోపడం, డెబిట్ కార్డుల నిర్వహణా ఫీజులు, ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జిలు ఇలా అనేకం ప్రజలపై మోపారు. ఇవన్నీ కలుపుకుంటే అత్యంత ముఖ్యమైన బ్యాంకింగ్ సేవలను పొందడం మరింత ఖరీదైనవిగా చేశాయని పొలిట్బ్యూరో పేర్కొంది.ప్రతిపాదిత బిల్లును తక్షణమే ఉపసంహరించు కోవాలని సిపిఎం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యుపిఐని ఉచితంగా, సార్వత్రికంగానే కొనసాగించాలని, అందరికీ అందుబాటులో వుండే, ప్రజలకు జవాబుదారీగా వుండే చెల్లింపుల వ్యవస్థగానే వుంచాలని పేర్కొంది.








కామెంట్లు (0)