న్యూఢిల్లీ : అనర్హత పిటిషన్లపై రెబల్ టిఎంసి ఎంపిలకు లోక్సభ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద 20మంది రెబల్ టిఎంసి ఎంపిలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లోగా ఆ నోటీసులపై సమాధానం ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నాయి. ఆగస్టు 25 (మంగళవారం ) జారీ అయిన ఈ నోటీసులతో పాటు లోక్సభ సభ్యుల (ఫిరాయింపు కారణంగా అనర్హత) నిబంధనలు, 1985లోని రూల్ 6 కింద, త్రిపురకి చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సిపిఐ)లో చేరిన ఎంపిలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ జూన్ 18న దాఖలు చేసిన పిటిషన్ కాపీని కూడా జత చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అనర్హత పిటిషన్లపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్లతో కూడిన ధర్మాసనం అంగీకరించిన ఒకరోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం : మహువా మొయిత్రా
తిరుగుబాటు ఎంపీలకు జారీ చేసిన నోటీసును తృణమూల్ ఎంపి మహువా మొయిత్రా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈవ్యవహారంలో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ జూన్ 19న 20 మంది ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, లోక్సభ స్పీకర్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. తమ పార్టీ ఎంపీలకు కేటాయించిన స్థానాలను తిరుగుబాటు ఎంపీలకు కేటాయించడం మినహా స్పీకర్ చేసిందేమీ లేదని ఆమె పేర్కొన్నారు. అయితే, స్పీకర్ సంబంధిత ఎంపీలకు నోటీసులు జారీ చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారని అన్నారు. ఆ నోటీసులపై ఆగస్టు 25 తేదీ ఉండటం, అదే రోజు కేసు విచారణ జరగడం అనుమానాలకు తావిస్తోందని మొయిత్రా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
టిఎంసిలో తిరుగుబాటు
ఎన్సిపిఐలో తాము చేరామని లేదా విలీనమయ్యామని, సభలో ప్రత్యేక గుర్తింపు కోరుతున్నామని తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎంపీలు 20 మంది ప్రకటించడంతో, ఆ పార్టీలో తిరుగుబాటు చెలరేగింది. దీని ఫలితంగా ఈ వివాదం తలెత్తింది. అనంతరం తిరుగుబాటు ఎంపీలను పార్లమెంటులో ఎన్సిపిఐ గ్రూపుగా పరిగణించి, ఎన్డిఎ పార్లమెంటరీ కార్యకలాపాలలో పాల్గొనేలా చేశారు. అయితే ఆ ఎంపీలు తమ గుర్తుపైనే ఎన్నికయ్యారని, మరో రాజకీయ కూటమితో పొత్తు పెట్టుకోవడం అనేది పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడంతో సమానమని, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఇది అనర్హతకు దారితీస్తుందని టిఎంసి వాదిస్తోంది. తమ చర్య చెల్లుబాటు అయ్యే విలీనమేనని తిరుగుబాటు వర్గం వాదిస్తోంది.








కామెంట్లు (0)