సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరసన హక్కు రాజ్యాంగబద్ధమే.. ‘చలో సంసద్‌’ పిటిషన్లపై జులై 28న విచారణ

1 గంట క్రితం

court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 12:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు రాజ్యాంగం హామీ ఇచ్చిందని ఉద్ఘాటించిన సుప్రీంకోర్టు, ‘చలో సంసద్‌’ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు క్రూరంగా వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన అన్ని పిటిషన్లపై జులై 28న విచారణ చేపట్టనున్నట్లు మంగళవారం తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన పిటిషన్ల విచారణ సోమవారం జరగాల్సి ఉండగా, అదే వ్యవహారంలో తమను కూడా పక్షాలుగా చేర్చాలని కోరుతూ దాఖలైన ఇంప్లీడ్‌మెంట్ దరఖాస్తులను సైతం విచారణ జాబితాలో చేర్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ‘‘శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని సిజెఐ ఉద్ఘాటించారు. ‘‘ఆందోళన శాంతియుతంగా ఉన్నంతవరకు.. కేవలం ఆందోళన జరుగుతుందనే కారణంతో పోలీసుల మితిమీరిన చర్యలు ఉండకూడదు. ఒక వేళ మితిమీరిన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉంటే.. స్వతంత్రంగా విచారించాలి’’ అని విచారణ సందర్భంగా సిజెఐ మౌఖికంగా వ్యాఖ్యానించారు. ప్రదర్శనల సమయంలో పోలీసుల ప్రతిస్పందనను నియంత్రించడానికి నిబంధనలు ఉండాలని సిజెఐ సూచించారు. కేవలం నిరసన జరుగుతోందన్న కారణంతో పోలీసులు దాడులు చేయడం సమర్థనీయం కాదని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో క్రమశిక్షణ అంతర్భాగమని స్పష్టం చేశారు.

నిరసనల సమయంలో దాడికి గురయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బంది కుటుంబాల తరఫున జోక్యం చేసుకోవాలని కోరుతూ ఒక న్యాయవాది దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను ధర్మాసనం విచారిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. “మేము ఇందులో పాల్గొని మా దృక్పథాన్ని తెలియజేయాలనుకుంటున్నాము. యూనిఫాంలో ఉన్న పోలీసులను కూడా రక్షించండి,” అని ఆ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

నిరసనకారులను నియంత్రించడానికి మోహరించిన పోలీసు సిబ్బందికి తగిన రక్ష‍ణ పరికరాలు, భద్రతా సౌకర్యాలు కల్పించారా లేదా అనే అంశాన్ని వివరించాలని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. పోలీసు సిబ్బందికి, నిరసనకారులకు అయిన గాయాలను సమానంగా పరిగణించాలని ఆయన సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్