లక్నో : సహరాన్పూర్లోని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలోని ఒక మసీదును యోగి ప్రభుత్వం శనివారం కూల్చివేసింది. సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ (ఎస్డిఎం), సిటీ మేజిస్ట్రేట్తో పాటు భారీ పోలీసుల మధ్య శనివారం అధికారులు మసీదును కూల్చివేశారు. సిటీ మేజిస్ట్రేట్ కోర్టు గత నెలలో ఆ మసీదును అక్రమమైనదిగా ప్రకటించి, దానిని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఘటనా స్థలానికి వెళ్లకుండా కైరానా ఎంపి ఇక్రా హసన్ను పోలీసులు గృహనిర్బంధం విధించారు. సహరాన్పూర్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, భారీగా పోలీసులు తన నివాసానికి చేరుకున్నారని, తనను అడ్డుకున్నారని ఆమె తెలిపారు. 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బిజెపి యత్నిస్తోందని సమాజ్వాది పార్టీ (ఎస్పి) ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక ఎమ్మెల్యె, ఇతరులతో పాటు తమ ఎంపిని గృహనిర్బంధంలో ఉంచినట్లు తమకు సమాచారం అందిందని అన్నారు.
బిజెపి రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఎస్పి సీనియర్ నేత, ఘాజీపూర్ ఎంపి అఫ్జల్ అన్సారీ పేర్కొన్నారు. ఒక ఎంపిపై గృహనిర్బంధం విధించడం కన్నా పెద్ద ముప్పు మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధి బాధ్యతఅని, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్ధమైనదని అన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మతపరమైన ప్రాతిపదికన రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించేందుకు బిజెపి నిరంతరం యత్నిస్తోందని అన్నారు.







కామెంట్లు (0)