తీర్పును సమీక్షించాలన్న పిటిషన్ను
తోసిపుచ్చిన ధర్మాసనం
న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక వ్యక్తి హిందూ మతం, సిక్కు లేదా బౌద్ధమతాలకు కాకుండా ఇతర మతాలకు మారినట్లైతే ఆ వ్యక్తి ఆ వెంటనే ఎస్సి హోదాను కోల్పోతారని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. మార్చి 24న ఇచ్చిన ఈ తీర్పును సమీక్షించాలని కోరుతున్న పిటిషన్ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన బెంచ్ తిరస్కరిస్తూ, రికార్డులో ఎటువంటి లోపం కనిపించడం లేదని పేర్కొంది. ఈ మేరకు జులై 15నాటి ఉత్తర్వులో పేర్కొంది. ‘‘రివ్యూ పిటిషన్పై మౌఖిక సమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్ తిరస్కరించింది. సమీక్షా పిటిషన్ను మేం పరిశీలించాం. అలాగే సమీక్షించాలని కోరిన మార్చి 24నాటి తీర్పును కూడా పరిశీలించాం. అందులో ఎలాంటి లోపం కనిపించలేదు. అందువల్లే సమీక్షా పిటిషన్ను తోసిపుచ్చాం.’’ అని ఆ ఉత్తర్వుల్లో న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది. క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే ఆ వ్యక్తి పూర్తిగా, తక్షణమే ఎస్సి హోదాను కోల్పోతారని హైకోర్టు పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధమతం కాకుండా మరే ఇతర మతాలను అనుసరించే ఏ వ్యక్తినీ ఎస్సి సభ్యుడిగా పరిగణించలేమని, రాజ్యాంగం (ఎస్సి) ఉత్తర్వు 1950లో 3వ క్లాజు కింద ఇది నిషేధించిందని కోర్టు పేర్కొంది.








కామెంట్లు (0)