కేంద్ర మంత్రివర్గం ఆమోదం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రూ.1,27,500 కోట్లతో సెమీకాన్ 2.0కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం రూ.2,19,353 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశాన్ని సెమీకండక్టర్ల తయారీలో గ్లోబల్ హబ్గా మార్చడం, మొబైల్ ఉత్పాదనను పెంచడం, ఎరువుల రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు వారణాసిలో ప్రతిష్ఠాత్మక ఇన్ఫ్రా ప్రాజెక్టులకు ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం 'సెమీకండక్టర్ మిషన్ 2.0'ను ప్రకటించింది. దీని కోసం ఏకంగా రూ.1,27,500 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్ సాధిస్తున్న దూకుడును మరింత పెంచేందుకు రూ.62,500 కోట్ల కేటాయింపుతో 'మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్స (ఎంపిఎంఎస్)కు ఆమోదం తెలిపింది. అలాగే 'నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా-2026'కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పుణ్యక్షేత్రం వారణాసి రూపురేఖలను మార్చేలా రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. వరుణా నది ఎలివేటెడ్ కారిడార్ ను రూ.10,998 కోట్ల వ్యయంతో వరుణా నది వెంబడి 6/4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. రూ.14,448 కోట్ల వ్యయంతో గంగా నది వెంబడి 6 లేన్ల అత్యాధునిక ఎలివేటెడ్ కారిడార్ను చేపట్టనున్నారు. దేశంలో సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు రెండు రైల్వే లైన్ల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పారాదీప్-హరిదాస్పూర్ రైల్వే లైన్: రూ.2,542 కోట్ల అంచనా వ్యయంతో ఈ రైల్వే లైన్ డబ్లింగ్ (రెండో లైన్) పనులను చేపడతారు. డాంగోవాపోసి-రాజ్ఖర్సవాన్ నాలుగో లైన్: రూ.1,365 కోట్ల పెట్టుబడితో ఈ మార్గంలో నాల్గవ రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.






కామెంట్లు (0)