లక్నో : అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన తుది నివేదికను తదుపరి చర్యల కోసం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అప్పగించినట్లు ఉత్తరప్రదేశ్ హోంశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నివేదికలో శ్రీరామ జన్మభూమి ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు సిట్ క్లీన్చిట్ ఇచ్చినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో విచారణ చేపట్టడానికి ముందే, ట్రస్ట్ అభ్యర్థన మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను యుపి ప్రభుత్వం జూన్ 13న ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ కిరణ్ ఎస్., ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక) నీల్ రతన్ కుమార్ ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జూన్ 23న యుపి ప్రభుత్వానికి తన ప్రాథమిక నివేదికను సమర్పించి, పలు సిఫారసులను చేసింది.
ప్రాథమిక నివేదిక ఆధారంగా, ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ శ్రీరామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్లో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుశ్ మిశ్రా, మనీష్ కుమార్యాదవ్, కరుణ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ (అలియస్ తిన్ను)లతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొంది. నిందితులపై బిఎన్ఎస్లోని సెక్షన్లు సహా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ కింద 13(1)(ఎ) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి ఎఫ్ఐఆర్ నమోదుకు, అరెస్టుకు ప్రాథమిక నివేదికే ఆధారంగా నిలిచింది.








కామెంట్లు (0)