- కమ్యూనిస్టు పార్టీల సభ్యుల వివరాలు సేకరించాలని ఆదేశంతో చర్యలు
చెన్నై: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీపీఐ(ఎం) సభ్యులు, నాయకుల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించిన దిండిగల్ జిల్లా గుజిలియంపరై తహసీల్దార్ ఎం. అయ్యస్వామిని తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంగళవారం అయ్యస్వామి గ్రామ సహాయకులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజు సాయంత్రంలోగా వివరాలను సమర్పించాలని, లేనిపక్షంలో గ్రామ సహాయకులపై చర్యలు తీసుకుంటామని ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కోసం చెన్నైలోని రెవెన్యూ పరిపాలన కమిషనర్ ఎదుట హాజరు కావాలని అయ్యస్వామిని ప్రభుత్వం ఆదేశించింది. తహసీల్దార్ ఎందుకు ఈ ఆదేశాలు జారీ చేశారన్నది తమకు తెలియదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం తెలిపారు. ఆయనను సస్పెండ్ చేసినట్లు తమకు సమాచారం అందిందని, ఉత్తర్వుల వెనుక కారణాలు విచారణ పూర్తయిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ఈ ఉత్తర్వులపై సీపీఐ(ఎం) ఎంపీ సచ్చిదానందం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాజకీయ పార్టీలపై నిషేధం ఉన్న సమయంలోనూ, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడూ ఇలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని ఆయన వ్యాఖ్యానించారు.








కామెంట్లు (0)