న్యూ ఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ, అల్లుడు, సిపిఎం నేత మహ్మద్ రియాజ్లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కేరళం పోలీసులను కోరడాన్ని సిపిఎం తీవ్రంగా నిరసించింది. ఈ మేరకు పొలిట్బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. వీణపై జరిగిన దర్యాప్తు అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకునేందుకు సాకు అన్నది మొదటినుండే స్పష్టమైందని పొలిట్బ్యూరో పేర్కొంది. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇలా కేంద్ర సంస్థలను ఉపయోగించుకునే తీరుకు ఇది ఒక ఉదాహరణ అని సిపిఎం ప్రకటన పేర్కొంది. ఇడి చర్యను కెపిసిసి అధ్యక్షుడు సమర్ధించారు. కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇది, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపుతోంది. అదే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై ఇడి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పినరయి విజయన్పై కేసు నమోదు చేయాలంటూ గతంలో కేరళంకు చెందిన కాంగ్రెస్ ఎంఎల్ఎ విజిలెన్స్ కోర్టుకు తర్వాత హైకోర్టు, ఆపై సుప్రీం కోర్టుకు వెళ్ళిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వుంది. అయితే, ఈ విషయంలో ఆయన విజ్ఞప్తిని కోర్టులు తిరస్కరించాయి. అదే కేసును ఇప్పుడు మళ్ళీ తిరగదోడుతున్నారని పొలిట్బ్యూరో పేర్కొంది. అలాగే, ఇడి ఏజెంట్గా వ్యవహరించొద్దంటూ సతీశన్ ప్రభుత్వాన్ని పొలిట్బ్యూరో హెచ్చరించింది. రాజకీయంగా, చట్టపరంగా తమ శాయశక్తులా ఈ రాజకీయ ప్రతీకార చర్యలను వ్యతిరేకిస్తామని సిపిఎం పొలిట్బ్యూరో స్పష్టం చేసింది.
టార్గెట్ విజయన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)