- ముగ్గురు హిందూపురం వాసులు మృతి
ప్రజాశక్తి–హిందూపురం : కర్ణాటక రాష్ర్టం దొడ్డబళ్లాపురంలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన ముగ్గురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు...హిందూపురం పట్టణం రహమత్ పురంలో నివాసముంటున్న జాకీర్, సుమయ్య దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు రుకయ్యా (13), రాకియా (8) ఉన్నారు. దొడ్డబళ్లాపురంలో నివాసం ఉంటున్న తమ అమ్మమ్మ ఇర్ఫానా(56) ఇంటికి ఆదివారం ఉదయం రుకయ్యా, రాకియా వెళ్లారు. తిరిగి అమ్మమ్మతో కలిసి సోమవారం ఉదయం హిందూపురానికి వచ్చేందుకు దొడ్డబళ్లాపురం రైల్వే స్టేషన్కు వచ్చారు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో బెంగళూరు వైపు నుంచి వస్తున్న లాతూర్ ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమ్మమ్మతో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడేళ్ల క్రితం జాకీర్, సుమయ్య దంపతులు తమ కుమారుడిని కోల్పోగా ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు రైలు ప్రమాదంలో మరణించారు.








కామెంట్లు (0)