పాలక్కాడ్ : కేరళ-తమిళనాడు సరిహద్దులో విషాద ఘటన చోటుచేసుకుంది. వలయార్ సమీపంలోని చావడిప్పర వద్ద గురువారం తెల్లవారుజామున రైలు ఢీకొనడంతో ఓ వన్య ఏనుగు, దాని పిల్ల మృతి చెందాయి. వలయార్-పాలక్కాడ్ అటవీ మార్గంలోని పుదుప్పతి సమీపంలో తెల్లవారుజామున సుమారు 12.30 గంటల సమయంలో మంగళూరు-చెన్నై సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఏనుగులను ఢీకొట్టింది. రెండు ఏనుగులు రైలు ఇంజిన్ కింద చిక్కుకోవడంతో రైలు రాకపోకలకు కొన్ని గంటలపాటు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, వలయార్ ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఏనుగుల మృతదేహాలను తొలగించి రైల్వే ట్రాక్ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. పోస్ట్మార్టం నిర్వహించేందుకు త్రిస్సూర్ నుంచి పశువైద్య బృందం కూడా అక్కడికి చేరుకుంది. తమిళనాడు అటవీశాఖ అధికారులు సైతం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ మార్గంలో ఏనుగులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండటంతో రాత్రి వేళల్లో రైళ్లను తక్కువ వేగంతో నడుపుతున్నారు. అయినప్పటికీ ఏనుగులు రైళ్లకు బలవుతున్న ఘటనలు కొనసాగుతున్నాయి.
ఇదే వలయార్ సమీపంలో ఫిబ్రవరిలోనూ రైలు ఢీకొనడంతో మరో వన్య ఏనుగు మృతి చెందింది. తాజా ఘటనతో వన్యప్రాణుల రక్షణ, రైలు మార్గాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది.








కామెంట్లు (0)