విజయవాడ : ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా హక్కు చట్టం ఆమోదించబడిన 2010 వ సంవత్సరం కన్నా ముందు నియమించబడిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయించాలని సిపిఐ (యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో అటువంటి టీచర్లు దాదాపు 90 వేల మంది ఉన్నారనీ, ఇప్పటికే వారు దీర్ఘకాలం అనుభవం ఉండి బోధన చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు వారంతా టెట్ రాసి ఉత్తీర్ణులయితేనే ఉద్యోగంలో కొనసాగుతారని చెప్పడం సహేతుకంగా లేదని చెప్పారు. ఈ నిబంధన కోచింగ్ సెంటర్లకు తోడ్పడవచ్చు తప్ప విద్యార్థులకు, విద్యా నాణ్యతకు ఉపయోగపడదు అని స్పష్టం చేశారు. 2028 ఆగష్టులోగా 2010 కి ముందు వారు కూడా ఉత్తీర్ణులు కావాలన్న సుప్రీం కోర్టు ఆదేశంతో సర్వీసులో ఉన్న టీచర్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వారిలో కొన్ని వేలమంది తొందరలోనే రిటైర్ అవుతున్నారు కూడా ! అని చెప్పారు. ఇటువంటి నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఊరట కలిగించడం అవసరం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ అయితే వేసింది గాని వెంటనే ఉపశమనం దొరుకుతుందని చెప్పలేము కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి విద్య హక్కు చట్టం సెక్షన్ 23(1) ను సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) కోరుతున్నదన్నారు. ఈలోగా ఉపాధ్యాయులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉపశమనం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ (యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.









కామెంట్లు (0)