ప్రధాని మోడీ ప్రారంభించిన ఐదు నెలలకే జలమయం
సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు
నోయిడా : బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ నిర్మించిన అంతర్జాతీయం విమానాశ్రయం కొద్దిపాటి వర్షానికే మునిగిపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ మార్చి 28న ఈ విమానాశ్రాయాన్ని ప్రారంభించారు. అయితే ఇటీవలే ఉత్తరాంధ్ర అభివృద్దికి రన్ వే అంటూ ప్రచారం చేసిన బొగాపురం విమానాశ్రయాన్ని కూడా ప్రధాని మేడీ ప్రారంభించడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జేవార్లో యమునా ఎక్స్ప్రెస్వే వెంబడి ఉన్న ఈ విమానాశ్రయం, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతానికి రెండవ అంతర్జాతీయ ప్రవేశ ద్వారంగా అభివృద్ధి చేశారు. మంగళవారం గ్రేటర్ నోయిడాలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు జేవర్లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గం వరదనీటితో నిండిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గాలేకపోవడంతో నీరు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. బిజెపి ప్రభుత్వం రూ.11,200 కోట్లతో నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించి 5 నెలలు కూడా పూర్తి కాకముందే వరదనీరు ముంచెత్తడంతో.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎయిర్పోర్టులో వర్షానికి టెర్మినల్-పార్కింగ్ మార్గంలో వరదనీరు నిలిచిపోయింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు, ప్రతిపక్షాలు కలిసి బిజెపి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. దీంతో ‘అభివృద్ధి మోడల్’గా ప్రచారం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది.
ఓడ రేవును తలపించిన విమానాశ్రయం..
విశ్వగురువు ప్రచారంలోని డొల్లతనాన్ని ఈ ఘటన బయటపెట్టిందని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. అంతేకాదు విమానాశ్రయం, ఓడరేవు రెండూ ఒకే చోట ఉన్నాయంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే, ఇదేనా వికాస్ గంగ, విమానాశ్రయంలో కొత్తగా స్విమ్మింగ్ పూల్ నిర్మించారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, నీరు నిలవడం తాత్కాలికమేనని, దానివల్ల విమాన కార్యకలాపాలకు గానీ, విమానాశ్రయం మొత్తం పనితీరుకు గానీ ఎలాంటి ఆటంకం కలగలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
విమానాశ్రయంలో పడవలు నడుస్తాయా? : అఖిలేశ్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నేరుగా బిజెపి పై సెటైర్ వేశారు. “ఇక విమానాశ్రయంలో పడవలు నడుస్తాయా ?” అంటూ ఎక్స్లో చమత్కరిస్తూ ప్రశ్నించారు. బిజెపి పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అయితే ఎయిర్పోర్టు యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ.. భారీ వర్షం కావడంతో టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే మార్గంలోకి వర్షపు నీరు వచ్చిందని తెలిపింది. తమ సిబ్బంది వెంటనే స్పందించి నీటిని తొలగించారని వెల్లడించింది.








కామెంట్లు (0)