జమ్ముకశ్మీర్:జమ్మూకశ్మీర్లోని కిశ్త్వాడ్ జిల్లాలో క్లౌడ్బరస్ట్ సంభవించింది. దీనివల్ల ఒక్కసారిగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో రహదారులన్నీ బురదమయంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో కిశ్త్వాడ్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ సైట్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ నిలిపి ఉంచిన పలు వాహనాలు, భారీ యంత్రాలు బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు వాటిని వెలికితీసేందుకు భారీ యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రకృతి విపత్తులో జరిగిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.
రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్.. హెల్ప్లైన్ ఏర్పాటు
పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం రంగంలోకి దిగింది. బురదను తొలగించి, వాహనాలను బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేసింది. ఎన్డీఆర్ఎప్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఆర్మీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్థానిక ప్రజలు, పర్యాటకులకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను, హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.







కామెంట్లు (0)