వాంగ్చుక్ పరిస్థితిపై వైద్యుల హెచ్చరిక
నిరవధిక నిరాహార దీక్షకు 20 రోజులు పూర్తి
స్పందించని మోడీ సర్కారు
దీక్షకు పెరుగుతున్న మద్దతు
20న పార్లమెంటరీ కవాతుకు కదులుతున్న యువత
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ పరీక్షల వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని నీట్ ప్రశ్నాపత్రం లీకేజి, సిబిఎస్ఇ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన పరిస్థితి ఆందోళన కరంగా మారుతోందని వైద్యులు హెచ్చరించారు. వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కు శుక్రవారం నాటికి 20 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దీక్ష శిబిరం వద్ద ఆయనను పరిశీలించిన వైద్యుల బృందం శరీరంలో కీలక మార్పులు ప్రారంభమయ్యాయని, దీక్ష ఇంకా కొనసాగితే అవయవాల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు వైద్య పరీక్షల అనంతరం వారు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. 20 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగినా మోడీ ప్రభుత్వంలో నామమాత్రపు స్పందన లేకపోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో వాంగ్చుక్కు మద్దతు పెరుగుతోంది. సోమవారం (20వ తేది) తలపెట్టిన పార్లమెంటు కవాతులో భాగస్వాములు కావడానికి దేశ వ్యాప్తంగా కదులుతున్నారు. తన ఆరోగ్యం క్షీణించినా జూలై 20వ తేది వరకు ఎలాగైనా బతికి ఉంటానని శుక్రవారం ఆయన ప్రకటించారు. ‘మీ అందరితో కలిసి పార్లమెంటుకు కవాతు చేస్తాను.’ అని అయన అన్నారు.
వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. ఆయన ప్రస్తుతం 24 గంటల పర్యవేక్షణలో ఉన్నారు. దీక్ష ప్రారంభించినప్పటి నుండి వాంగ్చుక్ బరువు 9.5 కిలోలు తగ్గింది. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తోంది. మరోవైపు వాంగ్చుక్కు మద్దతుగా రోజురోజుకూ ఎక్కువ మంది జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు. సిపిఎం ఎంపి వి. శివదాసన్ శుక్రవారం వాంగ్చుక్ను పరామర్శించి సంఘీభావం తెలిపారు. సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు విజూ కృష్ణన్, అశోక్ ధావలే, కేంద్ర కమిటీ సభ్యుడు విక్రమ్ సింగ్ సంఘీభావం తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆందోళనకు వేదికైన క్రాంతి కార్నర్ వద్ద విద్యార్థులు, యువతను ఉద్దేశించి మాట్లాడారు.
సిపిఎం ఆందోళన
సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంపై సిపిఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పొలిట్బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆందోళన, నిరసన చేస్తున్న నాయకులు, విద్యార్థులతో మాట్లాడేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం చూస్తుంటే ఆ ప్రభుత్వ నిరంకుశ స్వభావం, ఏ మాత్రం సున్నితత్వం లేకపోవడం వెల్లడవుతోందని పొలిట్బ్యూరో పేర్కొంది. ఎలాంటి లీకేజీలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడానికి మూలాలు జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి). 2020లో వున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. జాతీయ విద్యా విధానం ప్రోత్సహిస్తున్న ఈ విద్యా వ్యవస్థ కేంద్రీకరణ, వ్యాపారీకరణలే కోచింగ్ సంస్థలు పుట్టగొడు గుల్లా పుట్టుకురావడానికి దారితీస్తు న్నాయని పేర్కొంది. మతతత్వంతోపాటు పేపర్ లీకేజికి, అన్ని రకాల అవకతవకలకు ఇదే మూల కారణమని పొలిట్బ్యూరో విమర్శించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టిఎను, ఎన్ఇపి-2020ని రద్దుచేయాలన్న డిమాండ్ను సిపిఎం పునరుద్ఘాటించింది. సోనమ్ వాంగ్చుక్, నిరసన తెలుపుతున్న ఇతర విద్యార్ధులకు సంఘీభావంగా నిలవాల్సిం దిగా అన్ని శాఖలకు, సంబంధిత రంగాల ప్రముఖులకు పొలిట్బ్యూరో పిలుపునిచ్చింది. ఈ డిమాండ్ల సాధనకు, సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావంగా ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చింది.






కామెంట్లు (0)