- బిజెపి, హిందుత్వ శక్తుల తీరును ఖండించిన సిపిఎం
న్యూఢిల్లీ : బిజెపి, హిందూత్వ మతోన్మాద శక్తులు వందేమాతరాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు పట్ల సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఆమోదించిన ఆరు చరణాలతో కూడిన వందేమాతరానికి ప్రాధాన్యతనిచ్చే అంశాన్ని బిజెపి, హిందూత్వ శక్తులు దుర్వినియోగం చేస్తున్న తీరును సిపిఎం ప్రశ్నించింది. ఈ మేరకు పొలిట్బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పాటను జాతీయ గీతంగా అధికారికంగా పాడిన చారిత్రక సందర్భంపై సిపిఎం గతంలోనే సమగ్రంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. వాస్తవానికి, బంకిం చంద్ర చటోపాధ్యాయ్ రాసిన ఆనంద్మఠ్ నవలకు అనుగుణంగా వుండేలా దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఆరు చరణాలను అదనంగా కలిపారు. ఈ చారిత్రక వాస్తవాన్ని, పర్యవసానాన్ని ప్రాతిపదికగా తీసుకునే రవీంద్రనాథ్ ఠాగూర్తో సహా ఏ ఒక్కరూ కూడా దీన్ని జాతీయ గీతంగా ఆమోదించలేదు.
స్వాతంత్ర్య ఉద్యమంలో, రాజ్యాంగ నిర్ణయాక అసెంబ్లీలో ఆలపించినట్లుగా వందేమాతరం మొదటి రెండు చరణాలు ఆలపించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే, అదనంగా ఆరు చరణాలను కలిపి దాని హోదాను పెంచిన తర్వాత మార్పు చేసిన ఆ గీతాన్ని ఆలపించడమే దేశభక్తికి కొలమానంగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది హిందూత్వ శక్తుల మతోన్మాద, విచ్ఛిన్నకర లక్ష్యాలను స్పష్టంగా వెల్లడిస్తోంది. జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా మధ్యలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ బయటకు వెళ్లిపోవడం చూస్తే దేశభక్తి అనే ముసుగును ధరించిన వారి కపట వైఖరి బట్టబయలవుతోంది.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో వందే మాతరం నినాదం ఇవ్వడానికి కూడా నోరు పెగలని, ధైర్యం చాలని వారే నినాదాన్ని రగల్చడం విచారకరమని పొలిట్బ్యూరో అభిప్రాయపడింది. ఇది దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసే చర్య అని పేర్కొంది. రాజ్యాంగబద్ధంగా ఆమోదించిన భావనలన్నింటినీ గౌరవించాలని సిపిఎం ధృఢంగా విశ్వసిస్తోంది. ఎందుకంటే అవి, బహుళత్వాన్ని, సమ్మిళిత తత్వాన్ని గుర్తించే భారతదేశ భావనకు అదనపు అంశాలని పొలిట్బ్యూరో పేర్కొంది.








కామెంట్లు (0)